తెలంగాణ

telangana

By

Published : Aug 6, 2020, 6:09 PM IST

ETV Bharat / city

చంద్రగఢ్​ కోటకు పూర్వవైభవం ఎప్పుడో..?

ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యాటక రంగంలో పేరుమోసిన కోట. కాకతీయుల కళా వైభవానికి నిలువుటద్దం. అనేక విశిష్టతలకు ఆలవాలం. కృష్ణమ్మ పరవళ్ల నడుమ హోయలొలికే సౌందర్యం. గుర్తింపు లేక దశాబ్దాలుగా మరుగునపడిన చంద్రగఢ్‌ కోట వైభవం.. స్వరాష్ట్రంలోనైనా సాకారం కావాలని ప్రజలు కోరుతున్నారు.

people demands  prestige of Chandragarh Fort should be restored
చంద్రగఢ్​ కోటకు పూర్వవైభవం ఎప్పుడో..?

చంద్రగఢ్​ కోటకు పూర్వవైభవం ఎప్పుడో..?

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యాటక ప్రాంతాలుగా పిల్లలమర్రి, జూరాల ప్రాజెక్టుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. శతాబ్దాల క్రితం కాకతీయులు నిర్మించిన చంద్రగఢ్ కోటకు సరైన గుర్తింపు లేక.. మరుగున పడిపోయింది. ప్రభుత్వం స్థానికంగా ఉండే పర్యాటక ప్రాంతాలకు సజీవరూపం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని ఈ కోట ప్రాధాన్యం సంతరించుకుంది. అనేక విశిష్టతలకు నెలవైన చంద్రగఢ్‌ కోటను 18వ శతాబ్దిలో చంద్రగిరి మహారాజు చంద్రసేనుడు నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి.

ఇవిగో ప్రత్యేకతలు..

శత్రువుల బారి నుంచి రక్షించుకునేందుకు శత్రుదుర్భేద్యమైన కోట గోడలు నిర్మించారు. ప్రహరీ గోడలు చాలా ఎత్తుగా ఉండటంతో శత్రువులు లోనికి వచ్చే అవకాశమే లేదు. కోట ప్రధాన ద్వారం నేటికీ చెక్కు చెదరలేదు. ఇరువైపులా అరుగులు, ఎత్తయిన తలుపులు కోటపై భాగంలో అక్కడక్కడ ఫిరంగుల కోసం పైన గదులు నిర్మించారు. ప్రత్యర్థులు దాడికి వస్తే ప్రత్యేక దర్పణాలతో పసిగట్టి ఫిరంగుల ద్వారా మట్టికరిపించేలా నిర్మాణాలున్నాయి. ఈ కోటకు రెండు ముఖద్వారాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒకటి మూసి వేయగా.. పశ్చిమ ద్వారం నుంచి లోపలికి ప్రవేశం ఉంది. కోట లోపల నీటి ఎద్దడి తలెత్తకుండా 12 చెలిమెలు తవ్వించారు. రాయిపై నిర్మించిన చెలిమెలో నిత్యం నీళ్లు ఉండడం ఇక్కడి ప్రత్యేకత.

కాకతీయుల కాలంలో మొత్తం రాతితో కట్టిన ఈ కోటపై నుంచి చుట్టుపక్కల సుమారు పది కిలోమీటర్ల వరకు పచ్చని వాతావరణం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. కోట లోపల చంద్రసేనుడు తన ఇష్టదైవమైన రామలింగేశ్వరస్వామి ఆలయం కట్టించాడు. ఇప్పటికీ కోటపై రామలింగేశ్వరస్వామి జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. నాగుల చవితి రోజు జరిగే ఉత్సవాలలో భాగంగా నిర్వహించే కబడ్డీ పోటీల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యువకులు పాల్గొంటారు.

చంద్రగఢ్ కోటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని నాయకులు హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా... ఇంకా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కోటలో అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు రోడ్డు మార్గాన్ని మరింత విస్తరించాలని కోరుతున్నారు.

ఇవీచూడండి:రామమందిర నిర్మాణం.. 2024 ఎన్నికల వ్యూహమేనా?

ABOUT THE AUTHOR

...view details