Delay in crop booking app: రాష్ట్రంలో పండిస్తున్న పంటలపై పూర్తిస్థాయిలో వివరాలు సేకరించడమే లక్ష్యంగా... సర్కారు చేపట్టిన పంటల నమోదు తుదిదశకు చేరుకుంటోంది. గతేడాది వానాకాలంలో.. కోటి 52లక్షల 88వేల ఎకరాల్లో పంటలు నమోదు చేయగా ఈ ఏడాది కోటి 30లక్షల ఎకరాల్లోని పంటల్ని వివరాలు నమోదు చేశారు. మరో 23లక్షల ఎకరాల్లో ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఐతే క్రాప్ బుకింగ్లో వ్యవసాయ విస్తరణాధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గతంలో ఏ సర్వే నెంబర్లో ఎవరు ఎంత విస్తీర్ణంలో పంటలు వేశారో సమాచారం తెలుసుకొని... ఆ వివరాల్ని వెబ్సైట్లో నిక్షిప్తం చేసేవారు. ప్రస్తుతం పంటల నమోదుకు ప్రత్యేకంగా యాప్ రూపొందించగా... విస్తరణాధికారులు ప్రతి వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి... అక్కడి నుంచే యాప్ ద్వారా పంటల్ని నమోదు చేయాల్సి ఉంది. సర్వే నెంబర్లు, సబ్ నంబర్లు, ఎంత విస్తీర్ణంలో ఏ పంట పండిస్తున్నారో కచ్చితంగా నమోదు చేయాలి. సర్వేనంబర్ల వరకూ భూములు ఎక్కడున్నాయో భువన్ యాప్ ద్వారా గుర్తించగలిగినా, బై నంబర్ల భూముల్ని గుర్తించడం కష్టంగా మారుతోంది. గతంలో క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది సహకారం ఉన్నా... ఇప్పుడు వారు అందుబాటులో లేకపోవటంతో విస్తరణాధికారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
మారుమూల ప్రాంతాల్లో సెల్ఫోన్ సిగ్నల్స్ రాకపోవటంతో... ఇంటర్ నెట్ సౌకర్యం ఉండటం లేదు. కొన్నిచోట్ల సిగ్నల్ ఉన్నా... ఇంటర్నెట్ వేగం తక్కువగా ఉంటోంది. దీంతో మొబైల్ యాప్ పూర్తిస్థాయిలో తెరచుకోవడం లేదు. సిగ్నల్ ఉన్న ప్రాంతాలకు వెళ్లి... అక్కడన్నుంచి నమోదు చేయాల్సి వస్తోంది. మారుమూల ప్రాంతాలు, కొండలు, గుట్టలు దాటుకొని వెళ్లాల్సిన రావడం వ్యవసాయ విస్తరణాధికారుల్లో మహిళలు ఉంటుండటంతో... ఒంటరిగా అలాంటి ప్రాంతాలకు వెళ్లేందుకు నానాఅవస్థలు పడాల్సి వస్తోంది