తెలంగాణ

telangana

ETV Bharat / city

భక్తులు లేకుండానే భద్రాద్రిలో సీతారాముల కల్యాణం! - భక్తులు లేకుండానే భద్రాద్రిలో సీతారాముల కల్యాణం!

భద్రాద్రిలో సీతారాముల వారి కల్యాణ మహోత్సవం శాస్త్రీయంగా, సంప్రదాయబద్దంగా సాగింది. జనాల సందడి, భక్తుల జయధ్వానాలు, శ్రీరామ నామస్మరణలు, హంగూఆర్భాటాలు లేకుండా సీతారాముల కల్యాణం అత్యంత సాదాసీదాగా జరిగింది.

Sri Ramanavami Celebrations In Bhadrachalam With out devotees
భక్తులు లేకుండానే భద్రాద్రిలో సీతారాముల కల్యాణం!

By

Published : Apr 2, 2020, 9:00 PM IST

Updated : Apr 2, 2020, 11:57 PM IST

భక్తులు లేకుండానే భద్రాద్రిలో సీతారాముల కల్యాణం!

భద్రాచలం సీతారాముల వారి ఆలయంలో వైభవోపేతంగా సాగిన వసంతపక్ష ప్రయుక్త సన్నాహక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన సీతారాముల వార్షిక కల్యాణోత్సవం కమనీయంగా సాగింది.అంతకుముందు.. జరిగిన కమనీయమైన కల్యాణ క్రతువు ఆద్యంతం ఆకట్టుకుంది. సుందరంగా ముస్తాబైన నిత్య కల్యాణ మండపానికి దేవతామూర్తులను తీసుకొచ్చారు. తిరుకల్యాణానికి సంకల్పం పలికి సర్వవిజ్ఞాన శాంతికి ఆరాధాన నిర్వహించారు. కల్యాణానికి ఉపయోగించే సామాగ్రికి సంప్రోక్షణ నిర్వహించిన తర్వాత రక్షాబంధనం నిర్వహించి యోక్తధారణ చేశారు.

దర్భలతో ప్రత్యేకంగా అల్లిన తాడుని సీతమ్మ నడుముకి బిగించగా.. దీన్ని యోక్తధారణగా పండితులు వివరించారు. సీతారాముల వారికి రక్షబంధనం కట్టి గృహస్త ధర్మం కోసం రాములవారికి యజ్ఞోపవీత ధారణ చేశారు. తాంబూలాది సత్కారాలు, కన్యావరుణం నిర్వహించి తాంబూలాది సత్కారాలు అందించారు. శ్రీరాముడికి సీతమ్మ తగిన వధువని పెద్దలు నిర్ణయించగా... చూర్ణికను పఠించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. వేద మంత్రాలు మారుమోగుతుండగా..

జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు. దీన్నే శుభ ముహూర్తంగా.. జగత్ కల్యాణంగా వైదిక పెద్దలు ఉదహరించారు. కల్యాణం తర్వాత జరిగిన ముత్యాల తలంబ్రాల వేడుక.. సీతారాముల కల్యాణ మహోత్సవానికి మరింత వన్నెతెచ్చింది.

ఏటా రాములోరి సన్నిధిలోని మిథిలా ప్రాంగణంలో అత్యంత అంగరంగ వైభవంగా సాగాల్సిన కల్యాణ వేడుక.. ఈసారి కరోనా ప్రభావం వల్ల, భక్తుల శ్రేయస్సుకై సాదాసీదాగా, భక్తజన సందోహం లేకుండ నిర్వహించాలని ప్రభుత్వం నిర్వహించింది. ఎలాంటి హంగూఆర్భాటాలు లేకుండానే ప్రధాన ఆలయంలోని నిత్య కల్యాణ మండపంలోనే సీతారాముల కల్యాణం జరిపారు. కేవలం వైదిక పెద్దలు, కొంతమంది ప్రముఖుల సమక్షంలో నిరాడంబరంగా కల్యాణం నిర్వహించారు. మంత్రులతోపాటు ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే పొడెం వీరయ్యతోపాటు మరికొంతమంది మాత్రమే కల్యాణ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించారు. భక్తుల కోసం సీతారాముల కల్యాణ వేడుకను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.

భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు ఉన్నప్పటికీ.. కరోనా ప్రభావంతో స్థానికంగా దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వలేదు. ఓవైపు ఆలయంలో సీతారాముల కల్యాణం కమనీయంగా సాగుతుంటే.. భద్రాద్రి పురవీధులన్నీ బోసిపోయాయి. ఆలయ పరిసరాలన్నీ గతంలో ఎన్నడూ లేనివిధంగా నిర్మానుశ్యంగా కనిపించాయి. శుక్రవారం నాడు శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి కూడా వైదికులు, ప్రభుత్వ ప్రతినిధులు మాత్రమే హాజరవుతారు.

ఇదీ చూడండి:

దేశంలో 1,834కు చేరిన కరోనా కేసులు.. 41 మంది మృతి

Last Updated : Apr 2, 2020, 11:57 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details