ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో ఆకతాయిల ఆగడాలకు హద్దూఅదుపూ లేకుండాపోతోంది. రోజురోజూ పెచ్చుమీరుతున్న ఆకతాయిల చర్యలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రాత్రి అయ్యిందంటే చాలు ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో రోడ్లపైకి రావాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. విచ్చలవిడిగా మద్యం సేవించడం, వాహనదారులతో ఘర్షణలకు దిగడం, ర్యాష్ డ్రైవింగ్లు, రణగోణధ్వనులు, వింతైన హారన్లతో ద్విచక్రవాహనాలు నడుపుతూ జనాలను భయాందోళనలకు గురిచేస్తున్నారు. ప్రధాన రహదారులపైనా ఇష్టారాజ్యంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఎటు నుంచి బైక్ వస్తుందో..ఎవరిని ఢీ కొడతారో తెలియక జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎవరైన ప్రశ్నించినా.. అంత వేగం ఎందుకు? అని సలహా ఇచ్చిన అంతే.. మద్యం మత్తులో విచక్షణా రహితంగా భౌతిక దాడులకు పాల్పడుతున్నారు.
కౌన్సెలింగ్ ఇస్తున్నా..
ఇక రాత్రి సమయాల్లో బైక్ రైడింగ్ పోటీలు, అర్ధరాత్రి నడిరోడ్లపై పుట్టిన రోజు వేడుకలు పరిపాటిగా మారాయి. మద్యం సేవించడం, అటుగా వచ్చిన వారిపై దాడి చేయడం, బెదిరింపులకు పాల్పడటం అలవాటుగా మారిపోయింది. ఇటీవల అర్ధరాత్రి పార్టీలు మరీ ఎక్కువయ్యాయి. లాక్డౌన్ సమయంలో చాలా వరకు తగ్గినా సడలింపులు తర్వాత తిరిగి ఎక్కువయ్యాయి. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ, ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇస్తున్నా.. ఆకతాయిల్లో మార్పు రావడం లేదు.
ఆకతాయిలకు అడ్డాగా నిర్మానుష్య ప్రాంతాలు..
నగరంలోని చాలా ప్రాంతాలు ఆకతాయిలకు అడ్డాగా మారాయి. శివారు ప్రాంతాలతో పాటు నగరంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో విచ్చలవిడిగా మద్యం సేవిస్తున్నారు. అర్ధరాత్రి వరకు మద్యం సేవించి ఆ తర్వాత బైక్లపై షికార్లు చేస్తున్నారు. బైక్ రైడింగ్ పోటీలు పెట్టుకుంటూ తెల్లవారుజాము వరకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మంలో మమతారోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్, బైపాస్ రోడ్, రాపర్తినగర్, కొత్త బస్టాండ్ ప్రాంతం, ఎన్నెస్పీ క్యాంపు, వరంగల్ క్రాస్రోడ్లలో విచ్చలవిడిగా ర్యాష్ డ్రైవింగ్లు సాగేవి. ఈ పరంపర నగరం నడిబొడ్డుకు కూడా పాకింది. నగరంలోని ప్రధాన రహదారుల్లో రాత్రి సమయాల్లో ఒకే బైక్పై ముగ్గురికి తగ్గకుండా ఆకతాయిలు మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతుండటం సర్వసాధారణమై పోయింది. కొత్తగూడెంలోని పాల్వంచ, నవభారత్ రోడ్డు, రైల్వేట్రాక్లు, నిర్మానుష్య ప్రాంతాల్లో ఆకతాయిల సంచారం పెరుగుతోంది.
నమోదవుతున్న కేసులు తక్కువే!
మద్యం మత్తులో సాధారణ పౌరులు, మహిళలు, వాహనదారులపై ఆకతాయిల దాడుల జరుగుతున్నా ఆయా పోలీసుస్టేషన్లలో నమోదవుతున్న కేసుల సంఖ్య మాత్రం తక్కువే. ఖమ్మం జిల్లాలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో కేవలం 7 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆగస్టులో ఇప్పటి వరకు అతివేగం కింద 290 కేసులు చేశారు. సౌండ్ పొల్యూషన్ కింద 41 కేసులు నమోదు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 520 నమోదయ్యాయి.