తెలంగాణ

telangana

ETV Bharat / city

FLOOD: మురుగు నీటిని దాటితేనే పరీక్ష కేంద్రానికి.. తరగతి గదిలోనూ తప్పని తిప్పలు

చినుకు పడితే చాలు ఆ కళాశాల చిత్తడిగా మారుతోంది. భవనం చుట్టూ వర్షం నీటితో జలమయమవుతోంది. మోకాళ్ల లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లి.... విద్యార్థులు పరీక్షలు రాయాల్సిన దుస్థితి ఏర్పడింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సౌకర్యాల లేమితో అవస్థలు పడుతున్నారు.

By

Published : Jul 16, 2021, 5:29 AM IST

METPALLY Government Degree College
METPALLY Government Degree College

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కనీస వసతులు కరవయ్యాయి. కొద్దిపాటి వర్షానికే కళాశాల చుట్టూ నీరు వస్తుండటంతో.... విద్యార్థులు, ఆధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండ్రోజులపాటు కురిసిన వర్షానికి కళాశాల భవనం చుట్టూ వరద నీరు చేరి చెరువును తలపిస్తోంది. ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు జరుగుతుండగా.. విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. మురుగు నీటిని దాటుకొని వచ్చి పరీక్షలు రాస్తున్నారు.

నిర్మాణాలు అసంపూర్తిగానే..

ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని 2016లో ప్రారంభించారు. అయినా....ఇప్పటికీ నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయి. కళాశాల చుట్టూ ఎత్తైన కొండలు ఉండడంతో.... వర్షం పడిన ప్రతిసారి పైనుంచి వరద రావటంతో.... భవనం చుట్టూ నీరు నిలుస్తోంది. ప్రతి ఏడాది ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు తెలిపారు. భవనం పైపెచ్చులు ఊడి పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. గోడలకు పగుళ్లు రావడంతో తరగతి గదుల్లోకి వర్షం నీరు వస్తుందని తెలిపారు. ప్రస్తుతం పరీక్షల సమయంలో... నానా కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వరద నీటిలో మెట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల

ఐదో సెమిస్టర్ రాస్తున్నప్పుడు వర్షం పడి, కళాశాల అంతా మునిగింది. ఓఎంఆర్ షీట్లన్ని తడిచిపోయాయి. కాలేజ్ మొత్తం చెరువులా మారుతోంది. - డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థి.

ప్రభుత్వ డిగ్రీ కాళాశాలలో ఎలాంటి సౌకర్యాలు కూడా మాకు సక్రమంగా లేవు. కాలేజ్ లోపలికి రావడానికి కూడా చుట్టూ అంతా నీరు. ఎగ్జామ్ హాల్​లో కూడా పై నుంచి నీరు కారడం వల్ల మేము సరిగా పరీక్ష రాయలేకపోయాం - పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థి.

వర్షం పడితే కాలేజ్​లోకి రావడానికి ఇబ్బందిగా ఉంది. చుట్టూ అంతా వాటర్​తో నిండిపోయింది. తరగతి గదుల్లో వర్షపు నీరు కారి పుస్తకాలన్ని తడిచిపోతున్నాయి. సమస్యను పరిష్కరించాలని విద్యార్థులమంతా కోరుతున్నాం - విద్యార్థిని.

ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా..

కళాశాలలో పూర్తి సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రిన్సిపల్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. చుట్టూ ప్రహారీ గోడ లేకపోవటం, నీరు నిల్వటం సహా మరికొన్ని సమస్యలపై జిల్లా కలెక్టర్‌తోపాటు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. వసతులు కల్పిస్తే విద్యార్థుల సంఖ్య పెంచేందుకు మరింత దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

భౌతిక సౌకర్యాలు సరిగ్గా లేవు. సమస్యలకు సంబంధించి పై అధికారులకు మేము లేఖలు ఇవ్వడం జరిగింది. వర్షం రావడం వల్ల చుట్టుపక్కల ఉన్న నీరంతా కళాశాల ప్రాంగణంలోకి రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యే గారికి, కలెక్టర్​ గారికి పట్టణ ప్రగతి కార్యక్రమంలో విన్నవించడం జరిగింది. - చంద్రశేఖర్‌, ప్రిన్సిపల్‌ .

సర్కారు కళాశాలలను నమ్ముకున్న వస్తున్న విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చూడండి:HEAVY RAINS: రేపు, ఎల్లుండి అతి భారీ వర్షాలు!

ABOUT THE AUTHOR

...view details