తను గీసిన చిత్రాలన్నింటినీ ముచ్చటగా చూసుకుంటున్న ఈ యువతి పేరు సంగీత. ఉద్యోగరీత్యా విశాఖలో స్థిరపడిన కుటుంబం ఆమెది. ఇంజినీరింగ్ తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరింది. వివాహానంతరం.. భర్త ఆదిశేషుతో కలిసి బెంగళూరుకు వెళ్లినా.. విదేశాల్లో ఉద్యోగావకాశం రావడంతో.. భారత్ను వదిలి విమానం ఎక్కింది. అయినా... జీవితంలో ఏదో కోల్పోతున్నానన్న అసంతృప్తి సంగీతను వేధించడం ప్రారంభమైంది.
కంప్యూటర్ ముందు కూర్చుని పని చేయడం యాంత్రికంగా అనిపించేది సంగీతకు. అంతకు ముందే పెయింటింగ్లో ప్రవేశముండడంతో... స్థానికంగా జరిగే ప్రదర్శనలకు హాజరయేది. ఆర్ట్ మ్యూజియంలను సందర్శించేది. అలా తనకు ఇష్టమైన పెయింటింగ్కు దూరం కావడమే తనలోని అసంతృప్తికి కారణమని గుర్తించింది సంగీత.
ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఫైన్ ఆర్ట్స్లో చేరి..
చిత్రకళ పట్ల తనకున్న అభిరుచికి పూర్తి స్థాయిలో మెరుగులు దిద్దుకోవాలని సంగీత నిర్ణయించుకుంది. కుటుంబసభ్యుల సహకారంతో ఉద్యోగానికి రాజీనామా చేసి, సొంతూరికి తిరిగి వచ్చింది. ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. ఆత్మసంతృప్తికి మించిన ఆనందం లేదని తెలుసుకునేలా చేసింది. విశాఖకు తిరిగివచ్చిన సంగీత.. చిత్రకళపై పూర్తిస్థాయిలో పట్టు సంపాదించేందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఫైన్ఆర్ట్స్ విభాగంలో నాలుగేళ్ల బీఎఫ్ఏ కోర్సులో చేరింది. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతోంది.
గతేడాది దేశంలో నెలకొన్న పరిస్థితులు సంగీత ఆలోచనలకు పదునుపెట్టాయి. దేశమంతా ఇంటిపట్టునే సురక్షితంగా ఉంటే.. వారందరి రక్షణ కోసం ముందుండి పనిచేసిన ఫ్రంట్లైన్ వారియర్స్కు తన కళ ద్వారా కృతజ్ఞతలు చెప్పాలనుకుంది. వాటర్ కలర్స్ వినియోగించి, వారి కోసం 12 అద్భుతమైన కళాఖండాలు గీసింది. అవి తనకు ఎంతో సంతృప్తినిచ్చాయని చెప్తోంది సంగీత.