వికారాబాద్ జిల్లాకు చెందిన తిరుపతి రెడ్డి పర్యావరణ ప్రేమికుడు. పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అంటూ.. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సైకిల్ యాత్ర చేపట్టాడు. గతేడాది ఎవరెస్ట్ పర్వతం, ఆఫ్రికాలోని కిలిమంజారో, ఆస్ట్రేలియాలోని కోజియాస్కో, సిక్కింలోని రేనాక్ పర్వతాలు అధిరోహించాడు.
పర్యావరణ పరిరక్షణ కోసం.. సైకిల్ యాత్ర చేస్తున్న యువకుడు
పర్యావరణాన్ని రక్షించుకోవడం మన బాధ్యత.. అందరం కలిసి చెట్లు నాటుదాం అంటూ.. ఓ యువకుడు సైకిల్కి జాతీయ జెండా కట్టుకొని ప్రచారం చేస్తున్నాడు.
సేవ్ వాటర్.. సేవ్ ట్రీ.. సేవ్ ఫార్మర్ అనే నినాదంతో తిరుపతిరెడ్డి చేస్తున్న సోలో సైకిల్ యాత్ర మెదక్ చేరుకుంది. వికారాబాద్లో మార్చి5న మొదలుపెట్టిన ఈ సైకిల్ యాత్ర తెలంగాణ జిల్లాల్లో ప్రజలకు పర్యావరణ మీద అవగాహన కల్పిస్తూ సాగుతుందని తెలిపాడు తిరుపతి.
యాత్రలో భాగంగా.. పాఠశాలల్లో విద్యార్థులకు మొక్కలు నాటాల్సిన బాధ్యతను, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తూ సాగుతున్నాడు. ఇంకుడు గుంతల గురించి ప్రచారం చేస్తున్నాడు. దేశానికి వెన్నెముక రైతే.. తనని కాపాడుకోవాల్సిన బాధ్యత, గౌరవించాల్సిన బాధ్యత మనందరిదీ అని విద్యార్థులకు, యువకులకు అవగాహన కల్పిస్తూ తన సైకిల్ యాత్రను కొనసాగిస్తున్నాడు తిరుపతి రెడ్డి.