తెలంగాణ

telangana

By

Published : Dec 5, 2020, 9:35 PM IST

ETV Bharat / city

ఆశల పల్లకీలో... గ్రేటర్ పీఠంపై సర్వత్రా ఉత్కంఠ!

గ్రేటర్ ఎన్నికలు పూర్తికాగా... అందరూ మేయర్, ఉపమేయర్​ ఎవరనే అంశంపైనే చర్చిస్తున్నారు. రెండింటినీ కైవసం చేసుకుంటామని తెరాస ధీమాతో ఉండగా... పీఠం ఎవరికి దక్కుతుందోనని గులాబీ కార్పొరేటర్లలో ఉత్కంఠ మొదలైంది. ఎన్నికైన తెరాస కార్పొరేటర్లతో రేపు కేటీఆర్ భేటీ కానున్నారు. అభినందనలు తెలపటమే కాకుండా... స్థానిక ప్రజా ప్రతినిధులుగా ప్రజలతో ఎలా ఉండాలో దిశానిర్దేశం చేయనున్నారు.

ghmc new mayor
ghmc new mayor

వ్యూహ, ప్రతివ్యూహాలు.. ఎత్తులు, పైఎత్తుల మధ్య జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగియగా... ఇప్పుడు అందరి దృష్ఠి గ్రేటర్ పీఠంపై పడింది. మేయర్, ఉపమేయర్ స్థానాలను తామే కైవసం చేసుకుంటామనే ధీమాతో తెరాస ఉంది. ఏ పార్టీ సహకారం, పొత్తు లేకుండానే మేయర్​తో పాటు ఉపమేయర్ పదవులు దక్కించుకుంటామని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతుతో జెండా ఎగరేసేందుకు వ్యూహాలు రూపొందింస్తున్నట్లు తెలుస్తోంది. తెరాసకు దక్కడం ఖాయంగా కనిపిస్తుండటం వల్ల... ఆ పార్టీ తరఫున ఎన్నికైన కార్పొరేటర్లలో మేయర్, ఉపమేయర్ స్థానాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

రేసులో ఉన్నది వీళ్లే...

జీహెచ్ఎంసీ మేయర్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కావటం వల్ల... ఆశావహుల పోటీ ఎక్కువగానే ఉంది. తెరాస తరఫున 27 మంది మహిళలు ఎన్నికయ్యారు. వీరిలో ప్రధానంగా ఏడెనిమిది మంది మేయర్ రేసులో ఉన్నారు.

పటాన్​చెరు నియోజకవర్గం పరిధిలోని భారతీనగర్ నుంచి కార్పొరేటర్​గా ఎన్నికైన ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి కోడలు సింధు ఆదర్శ్ రెడ్డి పేరు ఎక్కవగా ప్రచారంలోకి వచ్చింది. ఖైరతాబాద్ కార్పొరేటర్, మాజీ మంత్రి పీజేఆర్ కుమార్తె విజయరెడ్డి సైతం మేయర్​ స్థానాన్ని ఆశిస్తున్నారు. చర్లపల్లి నుంచి ఎన్నికైన ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి రేసులో ఉన్నారు. బంజారాహిల్స్ నుంచి మరోసారి కార్పొరేటర్​గా ఎన్నికైన తెరాస సీనియర్ నేత కె.కేశవరావు కుమార్తె విజయలక్ష్మి కూడా ఈ జాబితాలో ఉన్నారు. అల్వాల్ నుంచి మరోసారి గెలిచిన మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు చింతల విజయశాంతి తమ ప్రయత్నాల్లో ఉన్నారు. తార్నాక నుంచి గెలిచిన తెరాస సీనియర్ నాయకుడు, ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న మోతె శోభన్ రెడ్డి భార్య మోతె శ్రీలత, వెంకటేశ్వర కాలనీ కార్పొరేటర్​గా ఎన్నికైన పార్టీ సీనియర్ నాయకుడు మన్నె గోవర్దన్ రెడ్డి భార్య కవిత పేరు విస్తృతంగా ప్రచారం జరుగుతున్నాయి.

జనరల్​కు రిజర్వ్ అయినందున ఓసీ వర్గాలకే మేయర్ స్థానం దక్కవచ్చునని తెరాస శ్రేణులు భావిస్తున్నాయి. మేయర్ స్థానం జవరల్ మహిళ కాబట్టి... డిప్యూటీ మేయర్ మైనారిటీ లేదా బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన పురుషులకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

కేటీఆర్​ దిశానిర్దేశం...

కొత్తగా ఎన్నికైన తెరాస కార్పొరేటర్లతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​... రేపు భేటీ కానున్నారు. రేపు మధ్యాహ్నం తెలంగాణ భవన్​లో తెరాస కార్పొరేటర్లు కేటీఆర్​ను కలవనున్నారు. విజేతలకు కేటీఆర్ అభినందనలు తెలిపి.. అందరితో ఫోటోలు దిగనున్నారు. ప్రజా ప్రతినిధులుగా రానున్న ఐదేళ్ల పాటు ప్రజాక్షేత్రంలో ఎలా ఉండాలో కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

ఇదీ చూడండి: 'హైదరాబాద్​ను భాగ్యనగరంగా మార్చాల్సిందే'

ABOUT THE AUTHOR

...view details