కొలువు పోగొట్టుకొని.. ఐదంకెల జీతాన్ని వదులుకుని వచ్చేసింది ఇంటికి. దిగాలుగా చూశాడు తండ్రి. భవిష్యత్తు ఎలా ? అని చూస్తుండిపోయారు ఇంట్లోవాళ్లు. శారద ముఖంలో ఏ ఆందోళనా లేదు. మర్నాడు ఉదయాన్నే లేచి తయారై చకచకా బయటకు వెళ్లిపోయింది.
నమ్మకంతోనే కౌంటర్ మీద కూర్చుంది...
శ్రీనగర్ కాలనీలో ఫుట్పాత్పై కూరగాయల కొట్టు. ఒకప్పుడు బండెడు సంసారాన్ని నెట్టుకొచ్చిన దుకాణం అది. ఈ కష్టకాలంలో ఆదుకోకపోతుందా అనే నమ్మకంతో కౌంటర్ మీద కూర్చుంది శారద. తండ్రి వెంకటయ్య ఆశ్చర్యపోయాడు. కూతుర్ని తేెరిపారా చూశాడు. శారద ముఖంలో ఏ ఆందోళనా కనిపించలేదు. ఆమె కళ్లల్లో నమ్మకం. నిన్నటి దాకా.. టిప్టాప్గా తయారై సాఫ్ట్వేర్ ఆఫీస్కు వెళ్తున్నప్పుడు కనిపించిన కూతురే.. ఇప్పుడు అక్కడా కనిపిస్తోంది.
25 ఏళ్ల కింద పట్నానికి...
పాతికేళ్ల కిందట వరంగల్ జిల్లా గన్నారం నుంచి హైదరాబాద్కు వచ్చారు వెంకటయ్య, సారమ్మ దంపతులు. వెంట ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. హైదరాబాద్లో కూరగాయల వ్యాపారం పెట్టుకొని పిల్లలను చదివించారు.
చిన్నప్పటి నుంచే చురుకు...
కూరగాయలు అమ్ముతూనే.. కూలీ పనులకూ వెళ్లేవాళ్లు దంపతులిద్దరూ. వీరి రెండో కూతురే శారద. బాగా చదివేది. చురుగ్గా ఉండేది. బీటెక్ చదివి.. 2016లో దిల్లీ దగ్గర్లోని గురుగ్రామ్లో పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం తెచ్చుకుంది.