తెలంగాణ

telangana

By

Published : Nov 4, 2020, 2:01 PM IST

ETV Bharat / city

మిస్టరీగా మిగిలిన ఉక్కు - పోస్కో ఒప్పందం

ఏపీలోని విశాఖ ఉక్కు సంస్థతో దక్షిణ కొరియా సంస్థ పోస్కో ఒప్పందం మిస్టరీగా మారింది. నెలలు గడుస్తున్నా అధికారిక పత్రాలు అందలేదు. దీంతో ఉక్కు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

మిస్టరీగా మిగిలిన ఉక్కు - పోస్కో ఒప్పందం
మిస్టరీగా మిగిలిన ఉక్కు - పోస్కో ఒప్పందం

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ ఉక్కు సంస్థతో దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ఉక్కు ఉత్పత్తిదారు పోస్కో చేసుకున్న ఒప్పందంలోని వివరాలేమిటన్న అంశం నెలలు గడుస్తున్నా మిస్టరీగానే ఉంది. గతేడాది నవంబరు నెలలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌... విశాఖ ఉక్కు కర్మాగారానికి వచ్చినప్పుడు పోస్కోతో భాగస్వామ్యం అనివార్యమని తేల్చిచెప్పారు. అనంతరం పోస్కోతో కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. నెలలు గడుస్తున్నా... ఆ ఒప్పందంలోని వివరాలు ఏమిటన్న విషయం మాత్రం వెలుగుచూడడంలేదు. తాజాగా సంయుక్త కార్యాచరణ బృందాన్ని కూడా ఏర్పాటుచేశారు.

విశాఖ అంటేనే వెంటనే ఎవరికైనా గుర్తుకు వచ్చే ఉక్కుకర్మాగార అస్థిత్వానికి తాజా ఒప్పందం మేలుచేస్తుందా? కీడు చేస్తుందా? అన్నది ఉత్కంఠగా మారింది. విశాఖ ఉక్కులోని ఎన్నివేల ఎకరాలను పోస్కోకు దారాధత్తం చేస్తారన్న అంశమే కీలకంగా మారింది. ప్రస్తుతం ఉక్కు కర్మాగారం పరిసరాల్లో భూమి విలువ హీనపక్షం గజం రూ.20వేల వరకు పలుకుతోంది. పోస్కోకు కనీసం 3,500 ఎకరాలు అవసరం అవుతుందని భావిస్తున్నారు. అంతభూమిని పోస్కో తీసుకుంటే ఉక్కు కర్మాగారం కేటాయించే భూముల విలువే రూ.33,800కోట్ల అవుతోంది. అంత విలువైన భూమిని కేటాయిస్తున్నందుకు ప్రతిగా ఉక్కు కర్మాగారానికి జరిగే మేలు ఏమిటన్నది ఎవరికీ అర్థం కావడంలేదు. ఒప్పందంలోని వివరాలు పారదర్శకంగా ఉంటే ఆయా ఒప్పంద వివరాలు ఎందుకు బహిర్గతం చేయడంలేదని పలువురు ఉక్కు ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

విశాఖ ఉక్కు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుంది. ప్రస్తుతం 7.3మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో నడుస్తున్న కర్మాగారాన్ని 20మిలియన్‌ టన్నుల సామర్థ్యానికి పెంచాలని నిర్ణయించారు. ఫలితంగా వేలాది మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. తాజాగా పోస్కోను ఉక్కు కర్మాగారంతో భాగస్వామిని చేస్తే ఉన్న ఉద్యోగాలు కూడా పోయే ముప్పు పొంచి ఉందని పలువురు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

పోస్కో సంస్థపై ఒడిశా రాష్ట్రంలో భారీఎత్తున ఉద్యమాలు జరిగాయి. ప్రజా సంఘాలు, పర్యావరణ సంఘలు, వేలాది మంది స్థానికులు చేసిన పోరాటాల ఫలితంగా పోస్కో ఆ ఒప్పందం నుంచి వైదొలిగింది. ఆయా చేదు అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని పోస్కో అధికారులు ఒప్పంద వివరాలు బయటకు పొక్కకుండా చూసుకుంటుండడం గమనార్హం. పోస్కోతో జరిగిన ఒప్పందం పత్రాలుగానీ, ఆ పత్రాల్లో ఉన్న వివరాలు గానీ తమకు తెలియవని, అధికారిక పత్రాలు కూడా ఇంకా అందలేదని ఉక్కు కర్మాగారానికి చెందిన ఓ అధికారి వెల్లడించారు.

ఇదీ చదవండి:అదృశ్యమైన చిన్నారి... విగతజీవిగా లభ్యమైంది...

ABOUT THE AUTHOR

...view details