తెలంగాణ

telangana

ETV Bharat / city

మెరుపు దాడులను ఎలా తిప్పికొడదాం.. ఎదురు దాడెలా చేద్దాం? - తూర్పు నౌకా దళ యుద్ధ సన్నద్ధతపై వైస్ అడ్మిరల్ సమీక్ష

మెరుపు దాడులను తిప్పికొట్టడం, ఆయుధాలతో ఎదురుదాడి, శతఘ్నులతో దాడి చేయడం తరహా విన్యాసాలు, యుద్ధ సన్నద్ధతను.. తూర్పు నౌకా దళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ సమీక్షించారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ పరిశీలనలో.. దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఉపయోగించాల్సిన వ్యూహాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.

vice admiral
vice admiral

By

Published : Jan 14, 2021, 10:35 PM IST

తూర్పు నౌకా దళం యుద్ధ సన్నద్ధతపై.. దళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ నాలుగు రోజుల పాటు సమీక్షించారు. విన్యాసాలు, యుద్ధం కోసం ప్రతి విభాగం సిద్ధమై ఉన్న తీరును ఆయన పరిశీలించారు. 22 యుద్ధ నౌకలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. మెరుపు దాడులను తిప్పికొట్టడం, ఆయుధాలతో ఎదురు దాడి, శతఘ్నులతో బహుముఖ దాడి చేయగల సామర్థ్యాన్ని పరీక్షించారు. యాంటీ సబ్ మెరైన్ విన్యాసాలు, టార్పెడో ఫైరింగ్, దళం బహుముఖ వ్యూహాలను వాస్తవ పరిస్థితుల్లో పరిశీలించారు.

సముద్రంపై యుద్ధ నౌకల్లో విధులు నిర్వర్తిస్తున్న నావికులను వైస్ అడ్మిరల్ కలిసి.. యుద్ధ సన్నద్ధత, దాడులను తిప్పికొట్టే అంశాలపై పలు సూచనలు చేశారు. బహుముఖ వ్యూహంలో భాగంగా.. నౌకా అవసరాలు, తీర ప్రాంత రక్షణ, ప్రాదేశిక జలాల్లో దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం తూర్పు నౌకా దళం నిత్యం సన్నద్ధంగా ఉండాలన్నారు. కొవిడ్​ను ఎదుర్కొంటూనే, యుద్ధ సన్నద్ధతను సమీక్షించుకోవడం వల్ల.. హిందూ మహా సముద్రంలో దేశ ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా చూడగలుగుతున్నామన్నారు.

గల్వాన్ లోయలో ఏర్పడ్డ పరిస్థితుల వల్ల తరుచూ సన్నద్ధతను పరీక్షించుకుంటున్నట్లు నేవీ వర్గాలు వెల్లడించాయి. విన్యాసాలు, సమీక్షలు మొత్తం సముద్రంలోనే జరిపినట్లు తెలిపాయి. తూర్పు నౌకా దళ సామర్ధ్యాన్ని తరుచూ మెరుగు పర్చుకునేందుకు ఇవి తోడ్పడతాయని అధికారులు వివరించారు. విపత్తుల సమయంలో మిషన్ స్థాయిలో మానవీయ సాయాన్ని అందించడం, స్నేహ పూర్వక నౌకా దళాలతో సంయుక్త విన్యాసాలు తరుచూ నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతుందన్నారు. దళం సామర్థ్యానికి ఈ చర్యలు మరింత పదును పెడతాయని వెల్లడించారు.

ఇదీ చదవండి:పేకాటలో ఉద్రిక్తం.. కోడి పందేల్లో యువకుల వివాదం

ABOUT THE AUTHOR

...view details