తెలంగాణ

telangana

By

Published : Feb 15, 2022, 7:14 PM IST

Updated : Feb 15, 2022, 10:48 PM IST

ETV Bharat / city

కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్రం స్పందన.. అపోహలు- వాస్తవాలు పేరిట ప్రకటన..

Union Power Ministry response to CM KCR comments
Union Power Ministry response to CM KCR comments

19:12 February 15

ప్రకటన విడుదల చేసిన కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ

Union Power Ministry response: భాజపా ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్​ సంస్కరణలపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ స్పందించింది. అపోహలు- వాస్తవాలు పేరిట కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. సౌర విద్యుత్‌ కొనుగోలుకు ఏ రాష్ట్రాన్ని బలవంతం చేయట్లేదని కేంద్రం ప్రకటనలో వివరించింది. ఓపెన్‌ బిడ్‌ల ద్వారానే కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేసింది. విద్యుత్ కనెక్షన్లు కచ్చితంగా ఇవ్వాలని రాష్ట్రాలను బలవంతం చేయట్లేదని స్పష్టతనిచ్చింది.

రాష్ట్రాల సొంత నిర్ణయం..

"సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఎప్పటికప్పుడు పునరుత్పాదక ఇంధనం కోసం ఓపెన్ బిడ్లు నిర్వహిస్తోంది. ఈ బిడ్‌లలో అనేక కంపెనీలు పోటీ పడుతున్నాయి. తక్కువ టారిఫ్‌ను అందించే కంపెనీలు ఓపెన్ బిడ్ ద్వారా పారదర్శకంగా ఎంపిక చేస్తారు. ఆ బిడ్‌ల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయాలనుకునే రాష్ట్రాలు తమ అవసరానికి అనుగుణంగా వ్యవహరిస్తాయి. బిడ్‌లలో ఖరారు చేసిన ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేయాలా.. వద్దా..? అనేది పూర్తిగా రాష్ట్రాల సొంత నిర్ణయం. వారు తమ సొంత బిడ్‌లను ఎంచుకోవచ్చు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటన పూర్తిగా అబద్ధం. రైతులకు విద్యుత్ మీటర్ల కనెక్షన్లు ఇవ్వాలని రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని కేసీఆర్​ చేసిన ప్రకటన పూర్తిగా తప్పు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి.. ఇలాంటి తప్పుడు, నిరాధారమైన ప్రకటనలు చేయడం తగదు." - ఆర్‌.కె.సింగ్‌, కేంద్ర మంత్రి

కర్బన ఉద్గార రహిత దేశంగా..

రాష్ట్రంలో జలవిద్యుత్‌ సామర్థ్యం పెరిగేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కాళేశ్వరం, పాలమూరు వంటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ ద్వారా 55 వేల కోట్లు అందించామన్నారు. ఈ విషయంలో కేంద్రానికి సీఎం కేసీఆర్​ కృతజ్ఞతలు తెలపాలన్నారు. పునరుత్పాదక ఇంధన వనరులు వినియోగం పెరగాలని అన్ని దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయన్నారు. పర్యావరణ క్షీణత, పెరుగుతున్న కర్బన ఉద్గారాలు, భూతాపం వంటి వాటిని తగ్గించేందుకు ముఖ్య దేశాలన్ని పునరుత్పాదక ఇంధనాన్నే వినియోగించాలని నిర్ణయానికొచ్చాయన్నారు. అందుకు అనుగుణంగా శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలు అన్ని.. 2050 నాటికి పునరుత్పాదక శక్తినే వినియోగించే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. భారత్‌ మాత్రం... కర్బన ఉద్గార రహిత దేశంగా మారేందుకు 2070 లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్లు పేర్కొన్నారు.

కేసీఆర్​ ఏమన్నారంటే..

విద్యుత్‌ సంస్కరణలపై కేంద్రం ముసాయిదా బిల్లు తెచ్చిందని.. సీఎం కేసీఆర్‌ ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మండిపడ్డారు. కొత్త విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వకూడదనేది కేంద్ర విధానమని ఆరోపించారు. వంద శాతం మీటరింగ్‌పై డిస్కంలు చర్యలు తీసుకోవాలన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలిపారు. ముసాయిదా బిల్లును వివిధ రాష్ట్రాలకు పంపించారని వివరించారు. ఆ బిల్లుపై 7, 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను కూడా చెప్పారన్నారు. బిల్లు ఆమోదానికి ముందే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు.. విద్యుత్‌ సంస్కరణలు వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించామని కేసీఆర్​ వివరించారు. పూర్తి కథనం కోసం..CM KCR Comments: మోటార్లకు మీటర్లు పెట్టబోమని కేంద్రానికి స్పష్టంగా చెప్పాం..

ఇదీ చూడండి:

Last Updated : Feb 15, 2022, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details