తెలంగాణ

telangana

By

Published : Feb 20, 2022, 5:27 AM IST

ETV Bharat / city

HC ON OMC CASE: ఓఎంసీ లీజుల కుట్రలో ఐఏఎస్‌ శ్రీలక్ష్మి ప్రమేయం

HIGH COURT ON OMC CASE: ఏపీలోని ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి లీజులు మంజూరు చేసిన కేసులో అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి నేరాలకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. విధి నిర్వహణలో భాగంగానే లీజులు మంజూరు చేస్తూ జీవోలు జారీ చేసినట్లు, జీవోలో క్యాప్టివ్ మైనింగ్​ను ఉద్దేశపూర్వకంగా తొలగించలేదన్నది తేల్చుకోవడానికి కింది కోర్టులో విచారణను ఎదుర్కోవాలని వెల్లడించింది. కింది కోర్టు విచారణలో తనకు రక్షణగా ఉన్న అన్ని అంశాలను వినియోగించుకోవచ్చంటూ.. శ్రీలక్ష్మి పిటిషన్ కొట్టివేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.

HC ON OMC CASE: ఓఎంసీ లీజుల కుట్రలో ఐఏఎస్‌ శ్రీలక్ష్మి ప్రమేయం
HC ON OMC CASE: ఓఎంసీ లీజుల కుట్రలో ఐఏఎస్‌ శ్రీలక్ష్మి ప్రమేయం

OMC CASE: ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు మైనింగ్‌ లీజులు మంజూరు చేసిన కుట్రలో అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి, ఐఏఎస్‌ వై.శ్రీలక్ష్మి ప్రమేయమున్నట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని హైకోర్టు పేర్కొంది. ఆమెపై నిర్దిష్ట ఆరోపణలున్నాయని వివరించింది. ప్రాథమికంగా నిందితుల పాత్రను కోర్టులు తేల్చాల్సి ఉందని స్పష్టం చేసింది. విధి నిర్వహణలో భాగంగానే లీజులు మంజూరు చేస్తూ జీవోలను ఇచ్చినట్లు ఆమె నిరూపించుకోవాల్సి ఉందని ఆదేశించింది. జీవోలో క్యాప్టివ్‌ మైనింగ్‌ను ఉద్దేశపూర్వకంగా తొలగించలేదన్నది నిర్ధారించడానికి విచారణను ఎదుర్కోవాల్సి ఉందని పేర్కొంది. కింది కోర్టు విచారించినప్పుడు తనకు రక్షణగా ఉన్న అన్ని అంశాలను వినియోగించుకోవచ్చని సూచిస్తూ శ్రీలక్ష్మి పిటిషన్‌ను కొట్టివేసింది.

ఓఎంసీ వ్యవహారంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయడంతోపాటు పరిహారం ఇప్పించాలంటూ అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి, ప్రస్తుత ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి 2015లో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలను విన్న జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ఇటీవల తీర్పునిచ్చారు. మైనింగ్‌ లీజులు కేంద్రం పరిధిలోనివని, ఇందులో తన పాత్ర లేదన్న శ్రీలక్ష్మి వాదనను అంగీకరించలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఓఎంసీకి లీజులు మంజూరు చేయాలని శ్రీలక్ష్మి ప్రతిపాదనలు పంపినట్లుందని వివరించారు. తిరస్కరించిన దరఖాస్తుదారులకు నోటీసులిచ్చి.. వారి అభ్యర్థనలను విన్నాక నిర్ణయం తీసుకోవాలని, ఒకవేళ తిరస్కరిస్తే కారణాలను ఉత్తర్వుల్లో పేర్కొనాల్సి ఉందని తెలిపారు. ఈ క్రమంలో ఐపీసీ సెక్షన్‌ 409 తనకు వర్తించబోదని పిటిషనర్‌ చెప్పజాలరని వివరించారు. కేసులో పిటిషనర్‌ పాత్ర విచారణార్హమైనదని అన్నారు.

మరిది ఆస్తులు కూడబెట్టారు..

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 13(1)(డి), 13(2) తమకు వర్తించబోవని, దానికి సంబంధించిన ఎలాంటి ఆరోపణలు లేవన్న పిటిషనర్‌ వాదనలను న్యాయమూర్తి తిరస్కరించారు. శ్రీలక్ష్మి ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆమె మరిది ఎం.రాకేష్‌బాబు ఆస్తులను కూడబెట్టినట్లు స్పష్టమైన ఆరోపణలున్నాయని పేర్కొన్నారు. దీనిపై కింది కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిందేనన్నారు. ఓఎంసీపీఎల్‌, బీఐఓపీఎల్‌తోపాటు ఇతర కంపెనీల సరిహద్దు వివాదం, అక్రమ మైనింగ్‌ మాత్రమే విచారించాలని ప్రభుత్వ ఉత్తర్వులున్నాయని.. అంతకుముందున్న లీజుల వ్యవహారాల్లోకి వెళ్లరాదన్న శ్రీలక్ష్మి వాదనతో ఏకీభవించలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు. అక్రమ లీజులతోనే అక్రమ మైనింగ్‌ జరుగుతుందని, దీనిపై దర్యాప్తు పరిధి సీబీఐకి ఉందని వివరించారు.

అక్రమ మైనింగ్‌ ఎంఎండీఆర్‌ చట్ట పరిధిలోనిది అయినప్పటికీ అక్రమ మైనింగ్‌కు సంబంధించిన ఐపీసీ నేరాలపై సీబీఐ దర్యాప్తు చేయకూడదని చెప్పలేమని వివరించారు. శ్రీలక్ష్మి ప్రస్తావించిన మాయావతి కేసు ఇక్కడ వర్తించబోదన్నారు. క్యాప్టివ్‌ మైనింగ్‌ సుప్రీంకోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించినందున తాను చట్టవిరుద్ధంగా వ్యవహరించినట్లు పరిగణనలోకి తీసుకోరాదన్న శ్రీలక్ష్మి వాదన అర్థరహితమని వివరించారు. ఈ కోర్టు ముందున్న ప్రశ్న క్యాప్టివ్‌ మైనింగ్‌ చట్టవిరుద్ధమా? కాదా? అన్నది కాదని పేర్కొన్నారు.

అరుదైన సందర్భాల్లోనే..

క్రిమినల్‌ కేసును కొట్టివేయడానికి హైకోర్టు పరిధిని చర్చించడం సముచితమని న్యాయమూర్తి పేర్కొన్నారు. అరుదైన సందర్భాల్లోనే విచక్షణాధికారాన్ని వినియోగించి న్యాయస్థానం కేసును కొట్టివేస్తుందని వివరించారు. ఆరోపణలను ఈ కోర్టు పరిశీలించే ముందు కింది కోర్టులో నిలుస్తాయా? లేదా? అన్నది పరిశీలించదని.. సాక్ష్యాలు, ఆధారాలు నమ్మదగినవా? కాదా? అన్నదానిపై కూడా విచారించదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:Medaram jathara 2022: ఘనంగా ముగిసిన మేడారం మహాజాతర..

ABOUT THE AUTHOR

...view details