సెప్టెంబరు 2న జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని తెరాస శ్రేణులకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. జెండా పండుగ, పార్టీ సంస్థాగత నిర్మాణంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ ఛైర్మన్లు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, సర్పంచులతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాలు, పట్టణాలలోని వార్డుల్లో పార్టీ జెండాను ఎగురవేయాలన్నారు. అదే రోజు దిల్లీలో పార్టీ కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు హాజరవుతున్నందున.. స్థానిక నాయకత్వమే జెండా పండుగ విజయవంతం చేయాలన్నారు.
"స్థానిక నాయకత్వమే జెండా పండగను విజయవంతం చేయాలి. సెప్టెంబరు 2 నుంచి 12 వరకు గ్రామ, వార్డు కమిటీల నియామకం జరుగుతుంది. 12 నుంచి 20 వరకు మండల, పట్టణ కమిటీల నియామకం.. ఆ తర్వాత జిల్లా కార్యవర్గాల ఎంపిక, జిల్లా అధ్యక్షుల ఎంపిక జరుగుతుంది. వచ్చే నెల 2న దిల్లీలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన జరుగుతుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు." - కేటీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు