తెలంగాణ

telangana

ETV Bharat / city

రాబోయే ఎన్నికల్లో తెరాస సత్తా చాటాలి : మంత్రి కేటీఆర్

శాసనమండలి ఎన్నికలు, వరంగల్‌ నగరపాలక సంస్థ ఎన్నికల్లోనూ తెరాస సత్తా చాటాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు స్థానిక నేతలకు సూచించారు. దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌ అనుభవాలను పరిగణనలోకి తీసుకొని పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగాలని చెప్పారు.

By

Published : Jan 16, 2021, 6:53 AM IST

trs working president ktr guidance to party leaders on coming elections
రాబోయే ఎన్నికలపై తెరాస శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం

వరంగల్‌ నగరపాలక సంస్థ, వరంగల్‌-నల్గొండ-ఖమ్మం పట్టభద్ర నియోజకవర్గ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ ఉమ్మడి వరంగల్‌ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్‌పర్సన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల ఛైర్మన్లు 64 మంది పాల్గొన్నారు.

దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల అనుకున్న ఫలితాలు రాలేదని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. ‘‘జరగబోయే ఎన్నికల ప్రాధాన్యాన్ని ప్రతీ ఒకరు గుర్తించి పనిచేయాలి. తెలంగాణలో తెరాస అత్యంతబలంగా ఉంది. 60 లక్షలకు పైగా సభ్యత్వాలున్నాయి. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. గెలుపే అస్త్రంగా మారాలి తప్ప ఓటమి గురించి మాట్లాడే పరిస్థితి రావొద్దు. మున్ముందు జరిగే అన్ని ఎన్నికల్లోనూ మనదే విజయమనే సంకేతాలు చాటాలి. ఎమ్మెల్యేలు ముఖ్యపాత్ర పోషించాలి. సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. కార్యకర్తలు, నేతలతో ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసి మెలిసి పనిచేయాలి.

ప్రతి 50 మంది ఓటర్లకో ఇన్‌ఛార్జి

మార్చి మొదటివారంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే వీలుంది. వాటి కోసం ప్రతి 50 మంది ఓటర్లకు ఒకరు, బూత్‌కు 15 మంది చొప్పున ఇన్‌ఛార్జీలను నియమిస్తున్నాం. ఈనెల 22లోగా మంత్రులు, ఎమ్మెల్యేలు వారి జాబితాలను సిద్ధం చేయాలి’’ అని కేటీఆర్‌ సూచించారు. పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానంతో పాటు నాగార్జునసాగర్‌ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలపై చర్చించేందుకు కేటీఆర్‌ శనివారం హైదరాబాద్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశం జరపాలని నిర్ణయించారు.

సైనికులకు సలాం :

భారత సైన్యం ధైర్య సాహసాలకు, త్యాగాలకు ప్రతీక అని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ అన్నారు. భారత సైనిక దినోత్సవం(ఆర్మీ డే) సందర్భంగా సైన్యానికి, వారి కుటుంబాలకు శుక్రవారం ఆయన ట్విటర్‌లో కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి షికాగోకు నేరుగా విమానం నడపాలని నిర్ణయించిన ఎయిర్‌ ఇండియాను అభినందింంచారు.

ABOUT THE AUTHOR

...view details