తెలంగాణ బిడ్డ, తెలుగు వాడు...దక్షిణాది నుంచి ప్రధానమంత్రి అయిన తొలి వ్యక్తి పీవీ నరసింహారావు అని ఎంపీ కేకే అన్నారు. అయిదేళ్ల పాటు విజయవంతంగా పదవిని నిర్వహించారని తెలిపారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడారని కొనియాడారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలని కితాబిచ్చారు.
శతజయంత్యుత్సవాల సంకల్పం ఏమిటి
ఇదంతా కేసీఆర్ చొరవే. దేశంలో మహానేతల్లో ఒకరైన పీవీకి ఆశించిన గుర్తింపు రాలేదు. చిన్నచూపు చూశారు. ఎన్నో రకాలుగా అవమానం జరిగింది. ఆరేళ్ల పాటు అధ్యక్షునిగా పనిచేసినా.. పార్టీ కార్యాలయంలో ఆయన పార్థివదేహాన్ని పెట్టలేదు. సగం సింహం అని ఆయన పేరు మీద ఒక పుస్తకం వచ్చింది. సగం సింహం కాదు. పూర్తి సింహమని నిరూపించాలని, ఇదే సరైన సందర్భం అని సీఎం భావించారు.
ఏడాది పొడవునా ఉత్సవాల నిర్వహణలో ఉద్దేశం
నేటి తరంలో చాలా మందికి పీవీ ఎవరో తెలియదు.ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. దేశంలో అత్యుత్తమ పదవిగా చెప్పే ప్రధాని స్థాయికి చేరడం ఒక అద్భుతం. రాజీవ్గాంధీ చనిపోయాక, భావోద్వేగాల నడుమ ప్రధాని పదవి చేపట్టారు. సామరస్యంగా, స్థిరంగా, శాంతియుతంగా ప్రభుత్వాన్ని నడిపారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని సంస్కరణలతో గట్టెక్కించారు. నూతన ఆర్థిక విధానం తెచ్చారు. ప్రపంచీకరణ నినాదం ఆయన చలవే. పీవీ గొప్ప విద్యావేత్త. బహుభాషాకోవిదుడు. నవోదయ, గురుకుల పాఠశాలలకు ఆద్యుడు. గొప్ప పార్లమెంటేరియన్. ఆయన ప్రసంగాలు వినసొంపుగా ఉండేవి. ప్రతి సందర్భంలో ఉపనిషత్తులు వినిపించేవి. పీవీకి ముందు...పీవీ తర్వాత అనే కోణంలో కార్యక్రమాలుంటాయి. ఇలా వీటన్నింటి గురించి చెప్పడానికి ఏడాది సరిపోదు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏ కార్యక్రమం నిర్వహించినా మూలాల్లోకి వెళతారు. పీవీకి తెలంగాణ బిడ్డగా గౌరవం దక్కాలన్నదే ఆయన తపన.
పీవీ పనితీరును ఎలా విశ్లేషిస్తారు
నా దృష్టిలో ఆయనవి అన్నీ విజయాలే. వైఫల్యాలు లేవు. ప్రధానిగా ఆయనకు తిరుగులేదు. ముఖ్యమంత్రిగానూ రాణించారు. దున్నే వానికే భూమి అనే మహాత్మాగాంధీ ఇచ్చిన నినాదం స్ఫూర్తిగా భూసంస్కరణలు తేవడం సాహసోపేత నిర్ణయం. ఇందిరా కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్గా కాంగ్రెస్ పార్టీ విడిపోయిన సమయంలో ఆయన రాజకీయంగా పరిణతిని ప్రదర్శించారు. ఏడో దశకంలో జరిగిన ఎన్నికల్లో బలహీనవర్గాలకు 127 టికెట్లు ఇచ్చి సామాజిక సాధికారితను చాటారు. పీవీని విదేశాంగ మంత్రిగా నియమించినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. తర్వాత కాలంలో ఆయన ద్వారానే అన్ని దేశాలతో సుహృద్భావం ఏర్పడింది.
ప్రధానిగా, సీఎంగా నాటి ఏపీపై పీవీ ముద్ర..