తెలంగాణ

telangana

By

Published : Feb 5, 2021, 10:08 PM IST

ETV Bharat / city

ఒక్కొక్కరికి రెండు ఓట్లు.. 21గ్రామాల్లో ఇదే తీరు

ఒక నేత రెండుచోట్ల పోటీ చేస్తారు..! మరి ఒక ఓటరు రెండు ఓట్లు వేయలేరా..? ఒకరిద్దరు కాదు ఏకంగా 21 గ్రామాలు.. కొన్నేళ్లుగా రెండు ఓట్లేస్తున్నారు. ఒకే వ్యక్తి ఇద్దరేసి సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకుంటున్నారు. రెండు రాష్ట్రాల పథకాలు అనుభవిస్తూ ఇద్దరేసి ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటున్న ఊరిపై ప్రత్యేక కథనం.

ఆంధ్ర, ఒడిశా ప్రభుత్వాల పథకాలు అందుకుంటున్న గిరిజనం..!
ఆంధ్ర, ఒడిశా ప్రభుత్వాల పథకాలు అందుకుంటున్న గిరిజనం..!

ఆంధ్ర, ఒడిశా ప్రభుత్వాల పథకాలు అందుకుంటున్న గిరిజనం..!

ఒక పౌరుడికి ఒకే ఓటు కార్డు ఉండాలనేది ఎన్నికల సంఘం ప్రాథమిక నిబంధన. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని కొన్ని గ్రామాలకు.. ఈ షరతు వర్తించదు. విజయనగరం, కోరాపుట్ జిల్లాల మధ్య ఉండే కొటియా పంచాయతీలోని 21 గ్రామాల్ని.. కొటియా గ్రామాలుగా పిలుస్తారు. విజయనగరం నుంచి 60కిలోమీటర్ల మేర కొండప్రాంతాల్లో ప్రయాణిస్తే కొటియా ప్రాంతాలకు చేరుకోవచ్చు.

ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అవతరించినప్పుడు కొటియా గ్రామాల్లో సర్వే జరగలేదు. వీటిని ఏ రాష్ట్రంలోనూ కలపలేదు. ఈ గ్రామాలు తమ పరిధిలోనివేనంటూ ఇరు రాష్ట్రాలూ వాదిస్తున్నాయి. 1968లో సుప్రీంకోర్టునూ ఆశ్రయించాయి. ఐతే పార్లమెంటులో తేల్చుకోవాలని 2006లో కోర్టు సూచించింది. నేటికీ ఆ పంచాయితీ తేలలేదు. కొటియా ప్రాంతంలో ఉండేదంతా గిరిజనులే. కొండల అవతలి వైపు.. కొటియా పంచాయతీ కేంద్రం ఉంది. దానికి దగ్గరగా ఉన్న గ్రామాల వారు ఒడిశా వైపు మొగ్గుతున్నారు.

అధికారులు శ్రద్ధ కనబర్చడం లేదు

ఈ గ్రామాలపై ఏపీ అధికారులు శ్రద్ధ కనబర్చడం లేదని... కొటియా, కురిటిభద్ర, మడకార్, డోలియాంబ తదితర గ్రామస్థులు బహిరంగంగానే చెబుతున్నారు. కొండకు ఇటువైపు ఉన్న... నేరేళ్లవలస, ఎగువశెంబి, దిగువశెంబి, ధూళిభద్ర, మూలతాడివలస, పగులు చెన్నేరు, పట్టుచెన్నేరులు, సొలిపిగుడ, శిఖపరువు గ్రామాలు ఏపీకి అందుబాటులో ఉన్నాయి. ఈ కొటియా గ్రామాల్లో రెండు ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఆయా గ్రామాల్లో బడులు, అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రులు కూడా రెండేసి ఉన్నాయి. అభివృద్ధి కోసం ఒడిశా ప్రభుత్వం వైపు.. సంక్షేమ పథకాల కోసం ఏపీ ప్రభుత్వం వైపు చూస్తున్నారు కొటియా వాసులు.

ఇరు రాష్ట్రాల్లోనూ ఓటేస్తారు..

అందుకే ఇరు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కచ్చితంగా ఓటేస్తారు. గతేడాది ఫిబ్రవరిలో ఒడిశా స్థానిక సమరంలో ఓటేసిన ఈ గిరిజనం.. ఇప్పుడు ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక‌్కు వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. కొటియా గ్రామాల్లో మాంగనీసు, ఇనుము, రంగురాళ్లు వంటి ఖనిజ సంపద ఉంది. ఇవి దక్కించుకునేందుకు ఒడిశా అధికారులు తరచూ ఈ గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:'ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజ్ యథాతథం'

ABOUT THE AUTHOR

...view details