తెలంగాణ

telangana

కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో

By

Published : May 18, 2021, 10:45 AM IST

Updated : May 18, 2021, 11:25 AM IST

కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఎంతో మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. మహమ్మారి బారిన పడతామనే భయాన్ని కూడా పట్టించుకోకుండా సేవలందిస్తున్నారు. లాక్​డౌన్​ నిబంధనలు పటిష్ఠంగా అమలయ్యేలా చర్యలు చేపడుతున్న పోలీసులు.. సమయం వచ్చినప్పుడల్లా తమలోని మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఇలాగే.. హైదరాబాద్​లోని పంజాగుట్టలో ఓ కానిస్టేబుల్​ చేసిన మంచిపని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది. సలామ్​ పోలీస్​ అంటూ నెటిజన్లతో చప్పట్లు కొట్టిస్తోంది.

constable humanity, constable humanity in punjagutta
కానిస్టేబుల్ మానవత్వం, పంజాగుట్టలో కానిస్టేబుల్ మానవత్వం

కొవిడ్ మహమ్మారి కోరలు చాస్తున్న వేళ.. అందరూ ఇళ్లలో సేదతీరుతుంటే పోలీసులు మాత్రం మండే ఎండలో రోడ్లపై విధులు నిర్వహిస్తున్నారు. మహమ్మారి సోకుతుందనే భయాన్ని కూడా లెక్కచేయక తమ విధుల్లో నిమగ్నమవుతున్నారు. ఓ వైపు లాక్​డౌన్ నిబంధనలు చక్కగా అమలయ్యేలా చూస్తూనే.. మరోవైపు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నారు. తమవంతు చేతనైనంత సాయం చేస్తున్నారు.

కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో..

హైదరాబాద్ పంజాగుట్టలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మహేశ్.. సోమాజిగూడలో రోడ్డుపై ఉన్న ఇద్దరు పిల్లల్ని చూశారు. ఆకలితో అలమటిస్తున్న ఆ పిల్లలు.. కనిపించిన ప్రతివారిని ఏడుస్తూ అడుక్కోవడం గమనించారు. ఆ దృశ్యం చూసి గుండె కరిగిన మహేశ్.. ఇంటి నుంచి తాను తెచ్చుకున్న లంచ్​ బాక్స్​ను వారికి అందించారు. అంతేకాకుండా.. ప్రేమతో వారికి వడ్డించారు. సోషల్​ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్​ అవుతోంది. సెల్యూట్ పోలీస్, శెభాష్ మహేశ్, హ్యాట్సాఫ్ పోలీస్ అంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఈ పిల్లల మాదిరి.. లాక్​డౌన్ వల్ల ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. పస్తులతోనే పూట గడుపుతున్నారు. ఖాళీ కడుపుతో కాలం వెల్లదీస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించి.. వారికి సరైన భోజనం, వసతి కల్పించేందుకు ప్రభుత్వం, అధికారులు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని నెటిజన్లు కోరుతున్నారు. ఇంట్లో ఉన్న వారు కూడా తమవంతు సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Last Updated : May 18, 2021, 11:25 AM IST

ABOUT THE AUTHOR

...view details