తెలంగాణ

telangana

By

Published : Jul 19, 2021, 8:38 AM IST

Updated : Jul 19, 2021, 2:26 PM IST

ETV Bharat / city

Revanth Reddy : లోక్‌సభ స్పీకర్‌కు రేవంత్‌ ఫిర్యాదు.. మేం అడ్డుకోలేదన్న ఏసీపీ

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. తనను పార్లమెంటు సమావేశాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. స్పందించిన పోలీసులు.. రేవంత్​ దిల్లీ వెళ్లకుండా తాము అడ్డుకోలేదని స్పష్టం చేశారు. కోకాపేట భూముల వద్ద ఆందోళనకు అనుమతి లేనందునే ఆయన ఇంటి వద్ద పోలీసులు బలగాలు మోహరించామని తెలిపారు.

Revanth Reddy
రేవంత్ రెడ్డి గృహనిర్బంధం

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల సందర్శన, ధర్నాకు కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కోకాపేట భూముల వేలంలో అవినీతి జరిగిందని ఇటీవల ఆరోపణలు చేశారు. కేంద్ర హోంశాఖకు ఆధారాలతో ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు సమావేశాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి ఇంటివద్ద పోలీసు బలగాలు

గృహనిర్బంధంపై లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. పార్లమెంటుకు రాకుండా గృహనిర్బంధం చేశారని తెలిపారు. తన హక్కులకు భంగం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కోకాపేటలో భూముల వేలం పారదర్శకంగా జరగలేదని, వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల ఆరోపించారు. ప్రధాన మంత్రి మోదీకి, హోం మంత్రి అమిత్ షా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిలకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. ఇవాళ పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు ఉదయం దిల్లీ వెళ్లాల్సి ఉన్న రేవంత్ రెడ్డిని తెల్లవారు జామున పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.

లోక్‌సభ స్పీకర్‌కు రేవంత్‌రెడ్డి ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. రేవంత్‌రెడ్డికి బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ లేఖ రాశారు. పార్లమెంటుకు వెళ్లకుండా అడ్డుకోలేదని లేఖలో పేర్కొన్నారు. కోకాపేట భూముల వద్ద ఆందోళనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అందుకే ఆయన నివాసం వద్ద బలగాలు ఉంచామని తెలిపారు. రేవంత్‌రెడ్డి దిల్లీ వెళ్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.

ప్రభుత్వ నియంతృత్వానికి ఇది పరాకాష్ఠ అని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి విమర్శించారు. భూముల వేలంలో అవినీతిని ఎండగడతారనే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. భయంతోనే ప్రభుత్వం కాంగ్రెస్ నేతలను అడ్డుకుంటుందన్నారు. ఇది అప్రజాస్వామికమని.. ఇంత దుర్మార్గం ఎక్కడా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంత, అవినీతి పాలకులకు ప్రజలే బుద్ధి చెబుతారని మల్లు రవి స్పష్టం చేశారు. రేవంత్‌ హౌస్ అరెస్టును మాజీ మంత్రి షబ్బీర్ అలీ, వేం నరేందర్‌రెడ్డి ఖండించారు. పార్లమెంటుకు వెళ్లకుండా అడ్డుకోవడం తగదన్నారు.

Last Updated : Jul 19, 2021, 2:26 PM IST

ABOUT THE AUTHOR

...view details