"రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి పీసీసీ ఇస్తే తెలంగాణ కాంగ్రెస్ అస్తవ్యస్తం అవుతుంది. సీనియర్లు సహకరించరు. పలువురు పార్టీని వీడతారు. పార్టీ రెండుగా చీలుతుంది" అంటూ కొందరు నేతలు హస్తం పార్టీ అధిష్ఠానానికి లేఖలు రాశారు. మరికొందరు ఒకడుగు ముందుకేసి పార్టీలో ఏదో జరుగుతుందని… బలహీనంగా ఉన్న పార్టీ అధోగతి పాలవుతుందని పరోక్షంగా హెచ్చరికలు చేశారు. కానీ.. రాష్ట్ర కాంగ్రెస్లో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. పీసీసీ ఎంపికకు ముందు వర్గపోరుతో సతమతమైన హస్తం పార్టీ....పీసీసీ అధ్యక్షుడు గా రేవంత్ రెడ్డి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.
అందుకే వాయిదా..
రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి పార్టీ పగ్గాలు ఇవ్వొద్దని అధిష్ఠానంపై సీనియర్లు పెద్ద యుద్ధమే చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా తర్వాత మొదలైన గొడవ.. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్.. నాయకుల నుంచి అభిప్రాయ సేకరణతో తారా స్థాయికి చేరింది. నాలుగు రోజుల అభిప్రాయ సేకరణలో మెజారిటీ నేతలు రేవంత్ రెడ్డికి అనుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేసినట్లు విషయం బయటకు పొక్కింది. అంతే.. ఇక సీనియర్లు ఒంటి కాలిపై లేశారు. వ్యతిరేక గళాన్ని మరింత పెంచారు. దీనివల్ల అధిష్ఠానం చేస్తున్న కసరత్తు… నూతన పీసీసీ ప్రకటన తరచూ వాయిదా పడుతూ వచ్చింది.