తెలంగాణ

telangana

బల్దియా పోరు: నేటి కార్పొరేటర్లే.. రేపటి కీలక నేతలు

By

Published : Nov 21, 2020, 7:46 AM IST

రాష్ట్ర రాజకీయాల్లో మంచి స్థానాల్లో ఉన్న చాలా మంది రాజకీయ నాయకులు... వాళ్ల ప్రస్థానాన్ని కార్పొరేటర్​ స్థాయి నుంచి ప్రారంభించారంటే నమ్ముతారా...? నిజమే... గ్రేటర్​ ఎన్నికల నుంచి వాళ్ల ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఎదిగారు. ఈ ఎన్నికల్లో గెలిచినా... ఓడినా... ఇక్కడితో అయిపోయిందని అనుకోకుండా... ప్రజాసేవలో కొనసాగితే రేపటి రోజు కీలక నేతలుగా ఎదుగుతారనటంలో ఎలాంటి అనుమానం లేదు.

బల్దియా పోరు: నేటి కార్పొరేటర్లే.. రేపటి కీలక నేతలు
బల్దియా పోరు: నేటి కార్పొరేటర్లే.. రేపటి కీలక నేతలు

ఎంతోమందికి రాజకీయ పునాది వేసినవి గ్రేటర్‌ ఎన్నికలే. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్‌ నేతలు తొలుత నగరం నుంచి కార్పొరేషన్‌ ఎన్నికల ద్వారా ప్రస్థానాన్ని ఆరంభించినవారే. 2016 ఎన్నికల్లో దాదాపు 1300 మందికి పైగా అభ్యర్థులు అన్ని పార్టీల నుంచి పోటీకి దిగారు. ఇందులో కొందరికే కుటుంబపరంగా రాజకీయ నేపథ్యం ఉంది. మిగతావారంతా నేతల అనుచరులు, సాధారణ వ్యక్తులే. ఈ దఫా కూడా అన్ని పార్టీల నుంచి ఆశావహులు రంగంలోకి దిగుతున్నారు. భవిష్యత్తులో నేతలుగా ఎదగాలంటే కొత్త వారికి ఈ ఎన్నికలే మొదటి మెట్టుగా భావించాలి. గెలిచినా...ఓడినా ఇక్కడితో అయిపోయిందని అనుకోకూడదు.

కార్పొరేటర్‌గా ఓడిన చాలామంది తర్వాత ఎమ్మెల్యే అయి మంత్రులుగా కూడా కొనసాగారు. నిబద్ధత, విశ్వసనీయత, నిజాయతీ, కష్టపడే తత్వం, సామాజిక సమస్యలపై క్షేత్రస్థాయి అవగాహన, జవాబుదారీ తనం, నాయకత్వలక్షణాలు, వ్యుహ ప్రతివ్యూహాలు తదితర లక్షణాలు ఉంటే ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవడం పెద్దకష్టం కాదు. పైసలు ఖర్చుపెడితే చాలు అనే ధోరణి మంచిది కాదు. ఓడిపోయినా నలుగురు తమ వెంట ఉండడమే కీలకం.. రాజకీయాల్లో స్థిరపడాలనుకునే వారికి కొన్ని లక్షణాలు తప్పకుండా ఉండాలని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. అవేమిటో చూద్దాం...

కలుపుకొనే తత్వం:ప్రజలతో సత్సబంధాలు లేని వ్యక్తులు నేతలుగా ఎదగడం అరుదు. నాయకుడికి అన్ని వర్గాలను కలుపుకొనిపోయే తత్వం ఉండాలి. ముఖ్యంగా అట్టడుగు ప్రజలతో మమేకమైనవారికి క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుస్తాయి. నిత్యం వారితో మాట్లాడటం వల్ల ఇతను తమవాడే అనే విషయం వారికి అవగతమవుతుంది. ఇందుకు కార్పొరేషన్‌ ఎన్నికలు ఒక అవకాశం. గెలిచినా, ఓడిచినా భవిష్యత్తులో వారి తరఫున నిలబడితే గుర్తింపు తప్పకుండా ఉంటుంది.

నిజాయతీ, నిబద్దత: మన ఎదుగుదల ఇతరులు మనపై ఉంచిన నమ్మకంపై కూడా ఆధారపడి ఉంటుంది. నిబద్దత, నిజాయతీనే ఆభరణాలు. ఫలితంగా ఎవరి దన్ను లేకపోయినా ఎదగవచ్ఛు ఉద్దండులు బరిలో ఉన్నా స్వతంత్రంగా పోటీ చేసి గెలుపొందినవారు ఎందరో. ప్రజలను ఒప్పించి ఆచరణ యోగ్యమైన హామీలిచ్చి వాటిని అమలు చేయడం ద్వారా మీరేమిటో తెలుస్తుంది.

అహంకారం కూడదు: అహంకార పూరిత మనస్తతత్వం రాజకీయ ఎదుగుదలకు సమాధి అని గుర్తించాలి. నాయకులుగా ఎదిగేవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అహంకారం పనికిరాదని మానసిక నిపుణులు చెబుతున్నారు. తొందరపాటు నిర్ణయాలతో ప్రజల్లో చులకనభావానికి కారణమమై ఆ తర్వాత రాజకీయ యవనికపై నుంచే నిష్క్రమించిన వారెందరో.

సామాజిక చైతన్యం:కార్పొరేటర్‌గా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నవారికి డివిజన్‌ లేదా నియోజకవర్గంపై పూర్తిస్థాయి పట్టు ఉండాలి. కుటుంబాలెన్ని? ఏయే వర్గాలు ఎంతమంది? అక్కడి సమస్యలేమిటి? నీటి సరఫరా, మురుగు వ్యవస్థ తీరు ఎలా ఉంది? గత అయిదేళ్లలో అక్కడ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ఇతరత్రా అంశాలపై కనీస అవగాహన ఉండాలి. ప్రజలతో మాట్లాడేటప్పుడు వాటిని ప్రస్తావించాలి. ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై పోరాటం చేస్తేనే గుర్తింపు దక్కుతుంది.

మంచి వక్తగా:కొందరి సభలంటే జనం తండోపండాలుగా తరలివస్తారు. వారు మాట్లాడుతుంటే ఆసక్తిగా వింటుంటారు. ఇందుకు కారణం ప్రసంగించే తీరే. మంచివక్తగా మారేందుకు కార్పొరేటర్‌ స్థాయి నుంచే పునాది పడాలి. మహానేతల జీవిత చరిత్రలు చదవాలి. వారు చెప్పిన మంచి మాటలను గుర్తుపెట్టుకొని అవసరమైనచోట ప్రస్తావించాలి. ఏదైనా సమస్య చెప్పేటప్పుడు అవసరమైన గణాంకాలు జోడించాలి. అలానే హాస్యోక్తులు, ఉదాహరణలు, పిట్టకథలు సందర్భానుసారం ప్రసంగంలో జోడించడమూ ఆకట్టుకునేదే.

ఇదీ చూడండి: బల్దియా పోరు: కసరత్తు ముగిసింది.. ప్రచారమే మిగిలింది..

ABOUT THE AUTHOR

...view details