తెలంగాణ

telangana

By

Published : Mar 9, 2021, 1:15 PM IST

Updated : Mar 9, 2021, 1:46 PM IST

ETV Bharat / city

ఎన్నికల్లో ఎవరూ తప్పుడు ఓట్లు వేయొద్దు : కోదండరాం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరూ తప్పుడు ఓట్లు వేయొద్దని తెజస అధ్యక్షుడు కోదండరాం విజ్ఞప్తి చేశారు. తెరాస సర్కార్ రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తోందని విమర్శించారు.

tjs-president-kodandaram-in-telangana-graduate-mlc-elections-campaign-2021
తెజస అధ్యక్షుడు కోదండరాం

మిలియన్ మార్చ్ జరిగి రేపటికి పది సంవత్సరాలు అవుతుందని.. తెలంగాణ ప్రజలు సమరశీలతో నిర్వహించారని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ తెలిపారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అమర వీరులకు నివాళి, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. వరంగల్‌లో అంబేడ్కర్ విగ్రహం నుంచి అమర వీరుల స్థూపం వరకు జరిగే ర్యాలీలో తానూ పాల్గొంటానని కోదండరామ్ వెల్లడించారు. ప్రభుత్వం మిలియన్ మార్చ్‌ను గుర్తు చేసుకునే ప్రయత్నం చేయలేదని ఆక్షేపించారు.

కేసీఆర్ నియంతృత్వంగా ప్రజల భాగస్వామ్యాన్ని రూపుమాపుతున్నారని కోదండరాం ఆరోపించారు. అన్ని వర్గాల్లో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉందని తెలిపారు. అసమర్థ, నిరంకుశ పాలనను తరిమికొట్టాలని ప్రజలు చూస్తున్నారని పేర్కొన్నారు. గత పట్టభద్రుల ఎన్నికల్లో దొంగ ఓట్లు నమోదు చేసుకున్నట్లు తమకు సమాచారం ఉందని.. దొంగ ఓట్లు వేసి కేసుల్లో ఇరుక్కోవద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతున్నా ఓటర్లంతా మార్చి 14 కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. పట్టభద్రుల నుంచి తమకు మంచి స్పందన లభిస్తుందని చెప్పారు.

ఈ ఎన్నికల్లో ప్రభుత్వం మనీ, మందు, పోల్‌ మేనేజ్‌మెంట్‌ మీద ఆధారపడిందని కోదండరాం ఆరోపించారు. కేయూలో విద్యార్థులపై జరిగిన దాడిని ఖండించారు. గత ఎన్నికల్లో గెలిపించినందుకు.. యూనివర్శిటీలను అభివృద్ది చేయాల్సింది పోయి.. సొంత విశ్వవిద్యాలయాలను నెలకొల్పుకున్నారని విమర్శించారు.

Last Updated : Mar 9, 2021, 1:46 PM IST

ABOUT THE AUTHOR

...view details