తెలంగాణ

telangana

ETV Bharat / city

Bathukamma day 3, 2021: మూడో రోజు 'ముద్దపప్పు బతుకమ్మ' విశేషాలు.. - తెలంగాణ వార్తలు

తెలంగాణలో అత్యంత వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. పెత్రమాస మొదలుకొని దుర్గాష్టమి వరకు తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తారు. పసుపు, కుంకుమలతో ఆ గౌరమ్మను కొలుస్తారు. తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ వేడుకల్లో ఒక్కో రోజుది ఒక్కో ప్రత్యేకత. రోజుకో రకమైన పూలతో.. రోజుకో ప్రత్యేకమైన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తారు. మూడో రోజు బతుకమ్మ(Bathukamma day 3, 2021) పేరు.. నైవేద్యం ఏంటో తెలుసా?

Bathukamma day 3, bathukamma celebrations in telangana
తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు, మూడోరోజు బతుకమ్మ విశేషాలు

By

Published : Oct 8, 2021, 6:01 AM IST

Updated : Oct 8, 2021, 6:08 AM IST

తెలంగాణలో పూల పండుగ ఉత్సవాలు షురూ అయ్యాయి. మహాలయ అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు ఈ వేడుకలు జరుగుతాయి. తంగేడు, గునుగు, తామర, గడ్డి పూలు మొదలుకొని తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఒక్కో రోజుది ఒక్కో ప్రత్యేకత. రోజుకో విధంగా గౌరమ్మను కొలుస్తూ... ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు. మూడో రోజు ఆశ్వయుజ విదియ నాడు 'ముద్దపప్పు బతుకమ్మ'గా(Bathukamma day 3, 2021) పూజిస్తారు. ఇవాళ ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేస్తారు.

రోజుకో తీరుగా..

తొమ్మిది రోజులు.. తొమ్మిది రూపాల్లో ఆ అమ్మవారిని కొలుస్తారు. ఆడబిడ్డలందరూ ఈ నవరాత్రులను(Bathukamma celebrations in telangana) ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మగా పూజిస్తారు. ఇవాళ తామర పాత్రల్లో మూడంతరాలలో చామంతి, సీతమ్మజడ, రామబాణం, మందార పూలతో బతుకమ్మను పేరుస్తారు. శిఖరంపై పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. ఉదయం పూజలు చేస్తారు. ఇలా చేస్తే ఆరోగ్యం, బోగభాగ్యాలు కలుగుతాయని తెలంగాణ ప్రజల విశ్వాసం.

బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో..

విశాలమైన ప్రదేశంలో తొలుత వెంపలి చెట్టును నాటి... దానిపై పసుపు కుంకుమను చల్లుతారు. అనంతరం బతుకమ్మలను ఆ చెట్టు చుట్టూ ఉంచుతారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ఒకరి చేయి ఒకరు పట్టుకొని కోలాటాలు చేస్తారు. మరికొందరు చేతిలో రెండు కర్రలను పట్టుకొని కోలాటం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో...., ఒక్కేసి పువ్వేసి చందమామ... ఒక్కజాములాయే చందమామ..., పసుపుల పుట్టింది గౌరమ్మా... పసుపుల పెరిగింది గౌరమ్మా... అంటూ చప్పట్లతో కష్టసుఖాలను తెలియజేసే జానపద పాటలు పాడుతారు. బంధాలు, బంధుత్వాలపైనా పాటలు పాడుతారు. పిల్లాపెద్దా కలిసి ఐక్యతా, సోదరభావం, ప్రేమానురాగాలతో జరుపుకుంటారు.

గంగమ్మ మెరిసే.. గౌరమ్మ మురిసే..

చీకటి పడే వరకు మహిళలంతా బతుకమ్మ ఆడుకుంటారు. అనంతరం బతుకమ్మను గంగమ్మ ఒడికి చేరుస్తారు. తర్వాత ఇంటి నుంచి తీసుకొచ్చిన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పించి.. ఒకరికొకరు పంచిపెడతారు. బతుకమ్మ పేర్చిన ఖాళీ షిబ్బి, తాంబాలంతో పాటలు పాడుకుంటూ.. బతుకమ్మను గుర్తు తెచ్చుకుంటూ ఇళ్లకు చేరతారు.

పల్లెల్లో కోలాహలం

ఆడబిడ్డలంతా తమ పుట్టిళ్లకు చేరుకుని తొమ్మిది రోజులపాటు బతుకమ్మ సంబురాలు చేసుకుంటారు. ఆడపడచుల రాకతో ప్రతి ఇంటా కోలాహలం మొదలైంది. చదువు పేరిట ఇంటికి దూరంగా వెళ్లిన వాళ్లంతా తమ ఊళ్లకు చేరుకున్నారు. బంధువులు, స్నేహితులతో రాష్ట్రంలోని పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి.

ఇవీ చదవండి:engili pula bathukamma: ఎంగిలి పూలతో బతుకమ్మకు స్వాగతం.. తెలంగాణలో ప్రతి ఇంటా కోలాహలం

Last Updated : Oct 8, 2021, 6:08 AM IST

ABOUT THE AUTHOR

...view details