తెలంగాణ

telangana

By

Published : Sep 1, 2020, 12:15 PM IST

ETV Bharat / city

'కొండపల్లి' తవ్వకాలపై నిగ్గుతేల్చిన కమిటీ...క్వారీ లీజుల రద్దు!

ఏపీలో కొండపల్లి అభయారణ్యం భూముల తవ్వకాలపై త్రిసభ్యకమిటీ నిగ్గుతేల్చింది. అక్కడ ఇచ్చిన క్వారీ లీజులను రద్దు చేసి, భూములను అటవీశాఖకు అప్పగించాలని సూచిస్తూ నివేదికను కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌కు అందించారు. తక్షణమే క్వారీల లీజులను రద్దు చేయాలని గనుల శాఖను కలెక్టర్‌ ఆదేశించారు.

the-tripartite-committee-was-shocked-over-the-excavation-of-kondapalli-sanctuary-lands
'కొండపల్లి' తవ్వకాలపై నిగ్గుతేల్చిన కమిటీ...క్వారీ లీజుల రద్దు!

కోట్లాది రూపాయల విలువైన ఖనిజ తవ్వకాలు జరిగిన ఏపీలోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం, జి.కొండూరు భూములు కొండపల్లి అభయారణ్యానికి (రిజర్వు ఫారెస్టు) చెందినవిగా ముగ్గురు అధికారుల కమిటీ తేల్చింది. అక్కడ ఇచ్చిన క్వారీ లీజులను రద్దు చేసి, భూములను అటవీశాఖకు అప్పగించాలని సూచిస్తూ నివేదికను కలెక్టర్‌ ఇంతియాజ్‌కు అందించారు. తక్షణమే క్వారీల లీజులను రద్దు చేయాలని గనుల శాఖను కలెక్టర్‌ ఆదేశించినట్లు తెలిసింది.

ఇష్టానుసారంగా అక్రమ తవ్వకాలు

కొండపల్లి అభయారణ్యంలో కొత్త సర్వే నంబర్లను సృష్టించి ఇష్టానుసారంగా కంకర(రోడ్డు మెటల్‌) మట్టి కోసం అక్రమ తవ్వకాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల పది పొక్లెయిన్లను, కొన్ని టిప్పర్లను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. వాటి నిర్వాహకులతో ముందస్తుగా రూ.10 లక్షల డిపాజిట్‌ చేయించారు. స్వాధీనం చేసుకున్న వాహనాలు ఎవరివనే కోణంలో విచారిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ అక్రమ తవ్వకాలపై గనుల శాఖ నుంచి ఎలాంటి కేసు నమోదవలేదు. పైగా ఈ భూములపై రెవెన్యూ, అటవీశాఖల మధ్య వివాదం నెలకొంది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడం వల్ల విజయవాడ సబ్‌కలెక్టర్‌ ధ్యానచంద్ర, జిల్లా అటవీ శాఖ అధికారి మంగమ్మ, గనుల శాఖ ఏడీ నాగిని సభ్యులుగా విచారణ కమిటీని వేశారు.

కొన్నేళ్లుగా తవ్వకాల పరంపర

త్రిసభ్య కమిటీ అందుబాటులో ఉన్న రికార్డులను, గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలించడంతోపాటు గ్రామాల్లో విచారణ అనంతరం ఆ భూములు అటవీ శాఖకు చెందినవిగా తేల్చారు. ఈప్రాంతాన్ని అటవీశాఖ అభయారణ్యంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అభయారణ్యంలో ఎలాంటి తవ్వకాలు చేయకూడదు. కనీసం రోడ్డు నిర్మించాలన్నా... కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి తీసుకోవాల్సిందే. అలాంటిది రోడ్డు మెటల్‌ కోసం కొన్నేళ్లుగా నిరభ్యంతరంగా తవ్వుకున్నారు.

  • కడెం పోతవరం గ్రామ పటం ప్రకారం సర్వే నంబర్లు 1, 4, 6, 7, 48, 49, 50, 53, 54 కొండపల్లి రిజర్వు ఫారెస్టుకు సరిహద్దుగా ఉన్నాయి. దీని ప్రకారం అన్‌సర్వే బ్లాక్‌లు లేవని అటవీశాఖ వాదన. లోయ, కడెం పోతవరం, కొండపల్లి గ్రామ పటాలు ఇవే సూచిస్తున్నాయి. మీభూమి పోర్టల్‌ ప్రకారం సర్వే నంబరు 26/2 పరిధిలో 256.15 ఎకరాలు ఉంది. పట్టాదారు, అనుభవదారు కాలమ్‌లో అడవిగా పేర్కొన్నారు. అంటే ఇక్కడ క్వారీకి గనుల శాఖ అనుమతి ఇవ్వకూడదు. అన్‌సర్వే బ్లాక్‌ అనేది రెవెన్యూ సృష్టి. అక్కడ అన్‌సర్వే బ్లాక్‌ లేదు. కానీ ఇందులో 250 ఎకరాల భూముందని జి.కొండూరు తహసీల్దార్‌ ఎన్‌ఓసీ జారీ చేయగా, గనుల శాఖ 18 లీజులు ఇచ్చారు.
  • సర్వే నంబరు 143ను కూడా రెవెన్యూ అధికారులే సృష్టించారు. ఇందులోని భూమి సైతం అడవిగానే గుర్తించి ఉంది. దీనిలోనూ 12 ఎన్‌ఓసీలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
  • మొత్తంగా గతంలో 1.5 హెక్టార్లలో కొన్ని, 15 హెక్టార్లలో కొన్ని లీజులు ఇచ్చారు. అసలు లీజుదారులు వీటిని ఇతరులకు అమ్మేసినట్లు సమాచారం.
  • కొండపల్లి అభయారణ్యం భూముల్లోని అన్ని క్వారీ లీజులను రద్దు చేయాలని ప్రస్తుత కలెక్టర్‌ ఆదేశించారు. దీనిపై గనుల శాఖ డైరెక్టర్‌తో జిల్లా సహాయ సంచాలకులు సంప్రదింపులు చేస్తున్నారు. లీజుకు తీసుకున్న వాటిలోనే కాకుండా చుట్టూ ఉన్న భూముల్లోనూ తవ్వకాలు జరిగాయి. దీనిపై అటవీశాఖ అధికారులు అంచనా వేసి ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న వాహనాల ఆధారంగా కేసును దర్యాప్తు చేయనున్నారు.

నాటి కమిటీ ఏం చెప్పిందంటే..

క్కడ 1980 నుంచి తవ్వకాలు సాగుతున్నాయని గనుల శాఖ చెబుతోంది. వాటికి ఎలా అనుమతిచ్చారనే దానికి సమాధానం లేదు. ఆయా లీజులను 2018లో నాటి కృష్ణా సంయుక్త కలెక్టర్‌ విజయకృష్ణన్‌ రద్దు చేశారు. సమస్యపై అదే ఏడాది నాటి సంయుక్త కలెక్టర్‌ బాబూరావు, గనుల శాఖ ఏడీ సుబ్రహ్మణ్యం, జిల్లా అటవీశాఖ అధికారి రామచంద్రరావులతో త్రిసభ్య కమిటీని వేశారు. ఆ భూములు అటవీ శాఖకు చెందినవిగా తెలిపే రికార్డులు లేవని, ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులకు గురయ్యే మీభూమి వెబ్‌సైట్‌ను సాక్ష్యంగా తీసుకోలేమని కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై కమిటీ సభ్యుడైన డీఎఫ్‌ఓ సంతకం చేయలేదు. ఫలితంగా మూడింట రెండు వంతుల ఆధిక్యం పేరిట పాస్‌ చేసి, క్వారీలను కొనసాగించారు.

ఇవీ చూడండి: ఇవాళ్టి నుంచి దూరదర్శన్, టీశాట్‌ ఛానళ్ల ద్వారా డిజిటల్ బోధన

ABOUT THE AUTHOR

...view details