The Culinary Lounge in Hyderabad : వినియోగదారుల్ని మెప్పించాలంటే.. మెనూలోని వంటకాలు రుచిగా ఉంటే మాత్రమే చాలదు. దాన్ని ఆస్వాదించే వాతావరణం, వైవిధ్యమైన ఆకర్షణలు కూడా ఉండాలి. వీటితో పాటు ఆహార ప్రియుల్ని మెప్పించేలా కస్టమైజేషన్ చేయడమే మా ప్రత్యేకత అంటున్నారు ‘ది కలినరీ లాంజ్’ నిర్వాహకుడు గోపీ కిశోర్ బైలుప్పుల. దీన్ని 2018లో ఏర్పాటు చేశారు. కార్పొరేట్, బిజినెస్ సమావేశాలూ, వ్యక్తిగత, కుటుంబ వేడుకలూ.. ఏవైనా ఇక్కడ ప్రత్యేకంగా జరుపుకోవచ్చు. అంతా కలిసి నచ్చినవి వండి వడ్డించుకోవచ్చు. ఖండాంతర రుచులు మొదలుకుని స్థానిక వంటకాల వరకూ ఏవైనా కోరుకోవచ్చు. ఇక్కడ ఏ ఒకరో ఇద్దరో మాత్రమే షెఫ్లు ఉంటారనుకుంటే పొరపాటు. ప్రపంచ వ్యాప్తంగా 500కుపైగా షెఫ్లతో ఒప్పందం చేసుకుందీ సంస్థ. వారిలో జాతీయ, అంతర్జాతీయ స్టార్షెఫ్లు గరిమా అరోరా, మిషెల్లిన్, జాన్సన్, మందర్ వంటి వారెందరో ఉన్నారు. వారినే ఇక్కడకు రప్పించుకునీ వండించుకోవచ్చు కూడా.
బడ్జెట్ చెబితే చాలు..
The Culinary Lounge : వైవిధ్యాన్ని కోరుకునే అతిథుల బడ్జెట్ ఆధారంగా కస్టమైజ్డ్, లగ్జరీ, ప్రీమియర్ ఏర్పాట్లు చేస్తారు. అవసరమైతే గంటల చొప్పున ఆ ప్రదేశాన్నీ అద్దెకు తీసుకోవచ్చు. కొవిడ్ తర్వాత ప్రైవేట్ డైనింగ్కి ఆదరణ పెరగడంతో రాజకీయనాయకులూ, సినీతారలూ, వ్యాపార వేత్తలెందరో ఈ సంస్థకు ఖాతాదారులుగా మారారు. ఇందుకోసం ప్రత్యేకంగా కాంట్రాక్ట్లూ చేసుకుంటున్నారు. కార్పొరేట్ సమావేశాల కోసం సంస్థ సుమారు వందకు పైగా థీమ్లను సిద్ధం చేసింది. డెలాయిట్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీలకు చెందిన టాప్ సీఎక్స్వోల సమావేశానికీ, సింగపూర్కి చెందిన గూగుల్ గ్లోబల్ టీమ్కూ, ఈవో గ్రూప్- సీఈవో క్లబ్ వంటివి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలకూ ఆతిథ్యం ఇచ్చింది.