తెలంగాణ

telangana

By

Published : Jan 12, 2022, 5:22 PM IST

ETV Bharat / city

Book Fair In Vijayawada: లక్షల పుస్తకాలు కళ్లారా చూసి.. మనసారా ఆస్వాదించిన పుస్తక ప్రియులు

Book Fair In Vijayawada : విజయవాడలో బుక్ ఫెయిర్ మంగళవారంతో ముగిసింది. మొత్తం 6 లక్షల మంది పుస్తక ప్రియులు పుస్తక మహోత్సవాన్ని సందర్శించారని.. దాదాపు రూ.5 కోట్ల వ్యాపారం జరిగిందని నిర్వాహకులు వెల్లడించారు.

Book Fair In Vijayawada, book fair last day
విజయవాడ బుక్ ఫెయిర్

Book Fair In Vijayawada : ఆంధ్రప్రదేశ్ విజయవాడ స్వరాజ్య మైదానంలో వెల్లువిరిసిన అక్షరచైతన్య మహోత్సవం ఘనంగా ముగిసింది. వేలాదిగా తరలివచ్చిన పుస్తక ప్రియులు లక్షల పుస్తకాలను కళ్లారా చూసి మనసారా ఆస్వాదించారు. సంక్రాంతికి ముందు చదువరుల పండుగ.. అన్నివర్గాలు, అన్ని తరగతుల వారిని విశేషంగా ఆకర్షించింది. దేశంలోనే ఓ మోడల్‌ సొసైటీగా పరిణమించిన విజయవాడ బుక్‌ సొసైటీ.. 32వ పుస్తక మహోత్సవం ద్వారా అక్షరాల రాశుల్ని అందరి ముందు ఉంచింది. మనుషులను.. మనసులను దగ్గర చేసి.. సజీవమైన జీవన అనుభవాల సారాంశాలతో కూడిన అనేక పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది.

ఆశాజనకంగా అమ్మకాలు

దేశంలోని గుర్తింపు పొందిన ప్రచురణకర్తలందరి ముద్రణలతో.. ఏర్పాటు చేసిన స్టాళ్లలో నిత్యం కొనుగోలుదారుల సందడి కనిపించింది. ఓ వైపు కరోనా భయంతో.. అమ్మకాలు ఎలా ఉంటాయో, సందర్శకులు వస్తారో రారో అనే సందిగ్ధం. కానీ ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన పుస్తక మహోత్సవానికి అనూహ్య స్పందన వచ్చింది. ప్రచురణకర్తల్లో ఆనందం తొణికిసలాడింది. కొవిడ్‌ కారణంగా ఉత్తరాది రాష్ట్రాల ప్రచరణకర్తలు రాకపోయినా.. అమ్మకాలు మాత్రం ఆశాజనకంగా కనిపించాయి. గత 11 రోజుల్లో మొత్తం 6 లక్షల మంది పుస్తక ప్రియులు సందర్శించారు. దాదాపు రూ.5 కోట్ల వ్యాపారం జరిగిందని నిర్వాహకులు వెల్లడించారు.

కళకళలాడిన ప్రాంగణం

పుస్తక మహోత్సవం చివరి రోజున ప్రాంగణమంతా మరింత కళకళలాడింది. పుస్తక ప్రదర్శన విజయవంతంగా నడవడం ఆనందంగా ఉందని నిర్వాహకులు, ప్రచురణకర్తలు అన్నారు. పుస్తక, సాహితీ అభిమానులు అధికంగా ఉండే ప్రాంతం విజయవాడ కావడం వల్లే క్లిష్టసమయంలోనూ విజయవంతంగా నడించిందనే అభిప్రాయం వ్యక్తమైంది. పుస్తకం లేని ప్రపంచం రాబోతోందనేది వాస్తవం కాదు. పుస్తకం మరణం లేనిది.. పుస్తకానికి ప్రత్యామ్నాయం లేదు.. ఉండబోదనే భావనను ఈ మహోత్సవం తిలకించేందుకు వచ్చిన వారిలో ప్రతిధ్వనించింది. 32 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న విజయవాడ పుస్తక మహోత్సవంలో నగరపాలకసంస్థ భాగస్వామి కావడంపై మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్న వెంకటేశ్‌ ఆనందం వ్యక్తం చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, విజయవాడ అడ్మిన్‌ డీసీపీ డి.మేరీ ప్రశాంతి పాల్గొన్నారు.

విజయవాడ బుక్ ఫెయిర్

ఇదీ చదవండి:Telangana Rains : రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షం

ABOUT THE AUTHOR

...view details