తెలంగాణ

telangana

రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా టెట్‌ నిర్వహణ.. భారీగా హాజరుశాతం నమోదు

By

Published : Jun 12, 2022, 8:24 PM IST

TET Exam: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష.. టెట్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం మొదటి పేపర్‌, మధ్యాహ్నం రెండో పేపర్‌ నిర్వహించారు. నిమిషం నిబంధనను అధికారులు పక్కాగా పాటించారు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను లోపలికి అనుమతించలేదు. పేపర్-1కు బీఈడీ, డీఈడీ అభ్యర్థులు.. పేపర్-2కు బీఈడీ అభ్యర్థులు పోటీ పడ్డారు.

TET Exam
TET Exam

రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా టెట్‌ నిర్వహణ

TET Exam: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్షను అభ్యర్థులు ఉత్సాహంగా రాశారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్​జీటీ ఉద్యోగాల అర్హత కోసం పేపర్-1.. 6 నుంచి 8 వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్‌కు అర్హత కోసం పేపర్-2 నిర్వహించారు. ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం 12 వరకు... మొదటి పేపర్, మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం 5 వరకు రెండో పేపర్‌ రాశారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను లోపలికి అనుమతించలేదు.

ఉపాధ్యాయ అర్హత పరీక్ష.. టెట్​కు 90శాతం అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం పేపర్-1కు 90.62 శాతం హాజరు నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 51వేల 482 అభ్యర్థుల్లో 3 లక్షల 18 వేల 506 మంది హాజరు కాగా... 32 వేల 976 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్ 2కి 90.35 శాతం హాజరు నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 77 వేల 900 మందిలో 2 లక్షల 51 వేల 70 మంది హాజరుకాగా 26 వేల 830 మంది గైర్హాజరయ్యారు. ఈ నెల 27న టెట్ ఫలితాలు వెల్లడించనున్నట్టు కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు.

తాజా నిబంధనల ప్రకారం టెట్ ఉత్తీర్ణత.. జీవితకాలం వర్తిస్తుంది. త్వరలో 13 వేల 86 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనుండటంతో ఈసారి టెట్ కు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. పేపర్-1కు బీఈడీ, డీఈడీ అభ్యర్థులు.. పేపర్ 2కు బీఈడీ అభ్యర్థులు పోటీపడ్డారు. ఆయా కేంద్రాల్లో నిర్వహించిన టెట్‌కు సుదూర ప్రాంతాల నుంచి అభ్యర్థులు తరలివచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల బయట.. పిల్లలతో తండ్రులు నిరీక్షించిన దృశ్యాలు కనిపించాయి.

చాలాకాలం తర్వాత పరీక్ష జరగడం వల్ల పోటీ తీవ్రంగా ఉంది. పరీక్ష రాసేందుకు గృహిణులు పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో చిన్నపిల్లల ఆలనాపాలనా చూసేందుకు కుటుంబసభ్యులు నానా తంటాలుపడ్డారు. ఎండల తీవ్రత దృష్ట్యా చెట్లకు ఉయ్యాలలు కట్టి వారిని ఊరడించారు. ఓ పాప ఆకలితో ఏడుస్తుండగా.. అక్కడే విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్‌ పాలు పట్టించారు. కొన్ని కేంద్రాలకు గర్భిణులు సైతం పరీక్ష రాసేందుకు వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం బీరంగూడలో టెట్ రాసేందుకు వచ్చిన మహిళా అభ్యర్థికి పురిటి నొప్పులు రావడంతో 108 సిబ్బంది ఆమెను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details