ఖైరతాబాద్లోని ఓ గల్లీలో అద్దెకు ఉండే వ్యక్తిలో కరోనా తరహా లక్షణాలు కనిపించాయి. ఆసుపత్రికి వెళ్లి పరీక్షకు నమూనాలు ఇచ్చి వచ్చాడు. తర్వాత బయటికి రాకుండా ఇంట్లో క్వారంటైన్లో ఉండిపోయాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వాళ్లు ఇంటి యజమానిని పిలిచి నానా హడావుడి చేశారు. దీంతో ఇంటి యజమాని ఆ కుటుంబాన్ని ఖాళీ చేయించాడు. తర్వాత బాధితుడికి పరీక్షలో నెగిటివ్ వచ్చినా.. చేసేదేమీ లేకపోయింది.
- కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నుంచి భద్రాద్రి జిల్లాలోని ఓ మండల కేంద్రంలో ఉన్న అత్తగారింటికి వెళ్లిన అల్లుడికి చేదు అనుభవం ఎదురైంది. ఇంటి నుంచి నాలుగు రోజుల పాటు ఆయన బయటకు రాకపోవడంతో అనుమానించిన పొరుగువారు ఆ ఇంటిపై దాడి చేసినంత పని చేశారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోక తప్పలేదు.
- భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలంలోని ఓ గ్రామానికి హైదరాబాద్ నుంచి వచ్చిన కుటుంబాన్ని గ్రామస్థులు అనుమతించలేదు. దీంతో వారు ఖమ్మంలోని ఓ దేవాలయంలో 14 రోజులు ఉండి భయంభయంగా ఇల్లు చేరారు.
కొవిడ్-19తో కలిసి బతకాల్సిందేనని పాలకులు, వైద్యులు సూచిస్తుంటే.. ఇంకోవైపు కిరాయికి ఉంటున్న వారిపట్ల గృహ యజమానులు కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారు. అద్దెకు ఉంటున్నవారు ఎవరైనా కరోనా బారిన పడితే.. ఆ కుటుంబం రోడ్డున పడుతున్న పరిస్థితి పలుచోట్ల కనిపిస్తోంది. ఎక్కడైనా పాజిటివ్ కేసు నమోదైతే సాధారణంగా ఆ చుట్టుపక్కల పరిస్థితిని వైద్య బృందాలు పరిశీలించి నమూనాలు సేకరిస్తాయి. వారిని కలిసిన వారి వివరాలు ఆరాతీస్తాయి. ప్రస్తుతం ఇది అద్దె ఇళ్లలో ఉంటున్న వారికి అవస్థలు తెచ్చిపెడుతోంది. కరోనా పాజిటివ్ బాధితులను, లక్షణాలున్న వారిని క్వారంటైన్కు తరలించడం ఆలస్యం.. ఇంటి యజమానులు ఆ కుటుంబాన్ని ఇల్లు ఖాళీ చేయాలని హుకుం జారీచేస్తున్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో ఈ తరహా వైఖరి బాధితులను కలవరపెడుతోంది.