తెలంగాణ

telangana

ETV Bharat / city

Alternative crops in TS: ప్రత్యామ్నాయ పంటలకు మార్కెటింగ్​ సమస్య.. కొనుగోళ్లు అంతంత మాత్రమే

Alternative crops in TS: యాసంగిలో రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. కానీ ఆ పంటను అమ్ముకోవడానికి రాష్ట్రంలో మార్కెటింగ్​ సమస్య ప్రధానం కానుంది. రైతులు పండించిన పంటను కేంద్రం 25 శాతం మాత్రమే తీసుకుంటుండటంతో గందరగోళం నెలకొంది. మరోవైపు భూమి సారాన్ని బట్టి ఏ పంట వేయాలో రైతులకు అవగాహన లేకపోవడంతో కొత్త ప్రయత్నాలతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

By

Published : Dec 22, 2021, 8:10 AM IST

alternative crops in telangana
యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగు

Alternative crops in TS: ప్రత్యామ్నాయ పంటల విషయంలో మార్కెటింగ్‌ సమస్యే కీలకం కానుంది. కంది, పెసర, మినుము తదితర పంటల ఉత్పత్తిలో 25 శాతం మాత్రమే నాఫెడ్‌ (జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ సంస్థ) ద్వారా కేంద్రం కొంటోంది. మిగిలిన 75 శాతంలో కొంత వ్యాపారస్థులకు అమ్ముకుంటారు. మరికొంతమేర రాష్ట్ర ప్రభుత్వం కొనాల్సి ఉంటుంది. ఇప్పటివరకు పప్పుధాన్యాల సాగువిస్తీర్ణం తక్కువగా ఉండటంతో కొన్ని సందర్భాల్లో మాత్రమే మార్కెటింగ్‌ సమస్య వస్తోంది. ఇప్పుడు యాసంగిలో వరి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా పప్పుధాన్యాల సాగు, ఉత్పత్తి, కొనుగోలును పరిశీలిస్తే కేంద్రం ఇక్కడి ఉత్పత్తిలో 25 శాతం మాత్రమే కొనడానికి ముందుకొస్తోంది. విదేశాల నుంచి దిగుబడి మాత్రం చాలా ఎక్కువగా ఉంటోంది.

మూడింతలు పెరగనున్న విస్తీర్ణం
యాసంగిలో ఆరుతడి పంటల సాగును ప్రత్యేకించి పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉదాహరణకు శనగ గత ఏడాది 3.54 లక్షల ఎకరాల్లో సాగైతే, ఈ ఏడాది 10 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని ప్రతిపాదించారు. ఇదొక్కటే కాదు మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, ఆముదం తదితర పంటల సాగు పెరగనుంది. వీటన్నింటికీ మార్కెటింగ్‌ కీలకం కానుంది.

మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలి
ప్రభుత్వ సూచన మేరకు ఈ యాసంగిలో వరికి బదులుగా తొమ్మిదెకరాల్లో మినుము సాగు చేశా. పురుగు వస్తోంది. ఏం వేయాలో తెలియదు. సక్రమంగా చెప్పేవారు లేరు. ఈ పంటలకు వచ్చే తెగుళ్లు, పట్టే పురుగులపై రైతులకు అవగాహన కల్పించాలి. సబ్సిడీపై విత్తనాలు ఇవ్వడంతోపాటు ఎరువులు, పురుగు మందులు కూడా సరఫరా చేయాలి. -సాగి అజయ్‌రావు, రైతు, బూర్గుపల్లి, గంగాధర మండలం, కరీంనగర్‌ జిల్లా

ప్రభుత్వ మద్దతు అవసరం

ముగిసిన వానాకాలంలో తెలంగాణలో 7.59 లక్షల ఎకరాల్లో కంది సాగైనట్లు వ్యవసాయ శాఖ లెక్కకట్టింది. 4.60 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఇందులో 80,142 మెట్రిక్‌ టన్నుల కొనుగోలుకు కేంద్రం అనుమతించింది. అంటే వచ్చే దిగుబడిలో 25 శాతం. మిగిలిన 2.65 లక్షల మెట్రిక్‌ టన్నులను రాష్ట్ర ప్రభుత్వం కొనాలి. లేదా రైతులు వ్యాపారులకు అమ్ముకోవాలి. కందికి ప్రకటించిన కనీస మద్దతు ధర రూ. 6,300. ఇంతకంటే ఎక్కువ వస్తే బయట అమ్ముకోవడానికి ఎలాంటి సమస్యా లేదు. ధర తగ్గితే ప్రభుత్వం జోక్యం చేసుకుని కొనాలి. అయితే ఇప్పటివరకు కేంద్రం నిర్ణయించిన 80,142 మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్లే ప్రారంభం కాలేదు. ఇదేకాదు, పప్పుదినుసులు, నూనెగింజల పంటలన్నింటిదీ ఇదే పరిస్థితి.

విదేశాల నుంచే ఎక్కువ

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నాఫెడ్‌ సంస్థ 2016-17 నుంచి 2020-21 వరకు 1.10 కోట్ల మెట్రిక్‌ టన్నుల పప్పు దినుసులను రాష్ట్రాల నుంచి కొనగా, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది సుమారు 2 కోట్ల మెట్రిక్‌ టన్నులు. దీనిని బట్టి ఇక్కడ ఉత్పత్తి పెరిగితే కొనుగోలుకు అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. కావాల్సిందిల్లా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం, సాగు విస్తీర్ణాన్ని, దిగుబడిని పరిగణనలోకి తీసుకొని ఎక్కువ కొనుగోలు చేయడమే.

అవసరమైన ప్రోత్సాహం ఇవ్వాలి

కొన్ని దశాబ్దాల క్రితం ధాన్యం దిగుబడిని పెంచేందుకు రైతులకు ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చారో ఇప్పుడు ఆరుతడి పంటలు సాగు చేసే రైతులకు కూడా అలాంటి ప్రోత్సాహం అందించినపుడే పంట మార్పిడికి మొగ్గుచూపుతారు. ప్రస్తుతం వరి సాగు చేసిన రైతు కంటే పెసర లేదా కంది రైతుకు తక్కువ ఆదాయం వస్తోంది. దీంతో పాటు మార్కెట్‌ ఒడిదొడుకులు ఉంటాయి. వ్యాపారుల మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఈ సమస్యలను అధిగమించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు రైతులకు నమ్మకం కలిగించాలి. రైతులకు తగిన ప్రోత్సాహకాలు అందజేయాలి. ఒకపక్క పప్పు దినుసుల కొరత ఉంది, ఇంకోపక్క రైతులు ఉత్పత్తి చేసింది కొనకపోతే ఎలా.? -ప్రొఫెసర్‌ డి.ఎన్‌.రెడ్డి, వ్యవసాయ ఆర్థికవేత్త

మార్కెట్‌ మాయాజాలాన్ని నివారించాలి

రైతులకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వర్షాలు పడి నీళ్లు నిల్వ లేకపోతే చాలు, ఇతరత్రా సమస్యలు పెద్దగా ఉండవు. కావల్సిందిల్లా ఉత్పత్తిని ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనడమే. మార్కెట్‌లో ధర తగ్గినపుడు ప్రభుత్వాలు కొనాలి. వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరించకూడదు. మన దేశానికి చెందిన కొన్ని ప్రముఖ కంపెనీలు విదేశాల్లో భూమి లీజుకు తీసుకొని సాగు చేస్తున్నాయి. వీరితో కేంద్రం బైబ్యాక్‌ పద్ధతిలో ఒప్పందం చేసుకొని కొంటోంది. ఇక్కడి రైతుల ప్రయోజనాలకు తగ్గట్లుగా విధానాల్లో మార్పు జరగాల్సి ఉంది. -రామాంజనేయులు, సుస్థిర వ్యవసాయ కేంద్రం

ఇదీ చదవండి:RS Praveen kumar meet KU Students: 'పేదలు చదువుకుంటే ప్రశ్నిస్తారనే భయం పాలకులకు పట్టుకుంది'

ABOUT THE AUTHOR

...view details