తెలంగాణ

telangana

ETV Bharat / city

రుణాలపై కేంద్రం ఆంక్షలు.. ఆదాయ మార్గాల కోసం సర్కారు కసరత్తు! - Telangana Debt Limit

Telangana government revenue sources: రుణాలపై కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనలు, ఆంక్షల మధ్య ఆర్థిక సంవత్సరం అర్ధభాగం గడిచిపోయింది. బడ్జెటేతర అప్పుల విషయంలో అభ్యంతరాలతో కేంద్రం ఎఫ్​ఆర్​బీఎం రుణ మొత్తంలో కోత విధించింది. ఆ ప్రభావంతో రాష్ట్రప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలో మార్పులు తప్పనిసరి కానుంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని సమీకరించుకునే కసరత్తును సర్కార్ కొనసాగిస్తోంది.

Telangana State
Telangana State

By

Published : Oct 1, 2022, 9:36 AM IST

Telangana government revenue sources: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి సగభాగం ముగిసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 2,56,958 కోట్ల వ్యయంతో భారీ బడ్జెట్‌ ప్రవేశ పెట్టింది. 2,52,661 కోట్లుగా ఆదాయం అంచనావేసింది. పన్ను ఆదాయాన్ని లక్షా 26,606 కోట్లుగా మొత్తం రెవెన్యూ ఆదాయాన్ని 1,93,029 కోట్లుగా అంచనా వేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎఫ్​ఆర్​బీఎం పరిధికి లోబడి 55వేల కోట్లను అప్పుల ద్వారా సమీకరించుకోవాలని ప్రభుత్వం భావించింది. ఐతే రుణాల విషయంలో కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు, ఆంక్షలు సర్కార్‌కి ఇబ్బందికరంగా మారాయి.

రుణ పరిమితిలో కేంద్రం కోత:వివిధ కార్పోరేషన్ల ద్వారా తీసుకున్న అప్పుల చెల్లింపులను బడ్జెట్ నుంచే చేస్తుండడంతో వాటిని ఎఫ్​ఆర్​బీఎం పరిధిలోకే పరిగణిస్తామన్న కేంద్రం ఆ మేరకు మొదట రుణాలకు అనుమతివ్వ లేదు. ఉత్తర, ప్రత్యుత్తరాలు జరిపాక రెండు నెలల తర్వాత జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల జారీతో అప్పులు తీసుకునేందుకు అనుమతి లభించింది. రుణ పరిమితిలో కేంద్రం కోత విధించడంతో పాటు కార్పోరేషన్ల ద్వారా తీసుకునే అప్పులకు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రభుత్వానికి ఆర్థికపరంగా ఇబ్బంది ఎదురైంది. తద్వారా ఉద్యోగుల వేతనాలు, ఇతర చెల్లింపులు ఆలస్యమవుతూ వచ్చాయి. వచ్చిన పన్ను ఆదాయంతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కాగ్​ లెక్కలు: కేంద్రం నిబంధనలు, ఆంక్షలతో నిధులను సమకూర్చుకునేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడింది. పన్నుల వసూలు వ్యవస్థను పటిష్టపరచడం ఓడీఎస్​ అమలు, నిరుపయోగంగా ఉన్న భూముల అమ్మకం, రాజీవ్‌స్వగృహ ఫ్లాట్ల విక్రయం వివిధ రుసుముల పెంపు తదితరాల ద్వారా ఆదాయం పెంచుకునే మార్గాలను కొనసాగిస్తోంది. అందుకు అనుగుణంగా సర్కార్‌కి కొంతమేర ఆదాయం సమకూరింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్​కు ఇచ్చిన వివరాల ప్రకారం ఆగస్టు వరకు రాష్ట్ర ప్రభుత్వానికి 61వేల కోట్ల రెవెన్యూ ఆదాయం సమకూరింది.

అందులో పన్ను ఆదాయం 49వేల కోట్లకు పైగా ఉంది. పన్నేతర ఆదాయం ద్వారా 7839 కోట్లు, గ్రాంట్ల రూపంలో 4011 కోట్లు సమకూరాయి. 18వేల కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఆదాయ మొత్తంలో ఐదు నెలల్లో 32శాతం మేర 80వేలకోట్లు సమకూరాయి. సెప్టెంబర్‌లో మరో పదివేల కోట్లకు పైగా పన్ను ఆదాయం సమకూరింది. ఆ నెలలో 3500 కోట్లు రుణంగా తీసుకొంది. దీంతో ఆర్నెళ్ల నాటికి సమకూరిన మొత్తం 95 వేల కోట్లు దాటి ఉండవచ్చని అంచనా.

ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి:ఆగస్టు వరకు ప్రభుత్వం చేసిన మొత్తం వ్యయం 72,625 కోట్లు. ఇది బడ్జెట్ అంచనాల్లో 33శాతం. సెప్టెంబర్‌లో కనీసం 15 వేల కోట్లకు పైగా వ్యయం అయి ఉండవచ్చని అంటున్నారు. మొదటి ఆర్నెళ్లలో చేసిన వ్యయం 90 వేల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో రెండో అర్ధభాగం రాష్ట్ర ప్రభుత్వానికి మరింత కీలకం కానుంది. పన్ను ఆదాయాన్ని వీలైనంత ఎక్కువగా పెంచు కోవడంతోపాటు పన్నేతర ఆదాయాన్ని బాగానే సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. రుణాల చెల్లింపు విధానంలో మార్పులు చేయడం ద్వారా కార్పోరేషన్ల ద్వారా తీసుకునే అప్పులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details