రాష్ట్రంలోని రెండు శాసనమండలి స్థానాల ఎన్నికల పోలింగ్లో పదేళ్ల క్రితం తయారు చేయించిన బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. ఈవీఎం యంత్రాల వినియోగానికి అవకాశం లేనందున, బ్యాలెట్ పత్రంతోనే పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ప్రస్తుతం మహబూబ్నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ నియోజకవర్గంలో 93 మంది (గతంలో ఇక్కడ అత్యధికంగా 57 మంది పోటీ చేశారు), వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గం నుంచి 71 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో దినపత్రిక సైజులో బ్యాలెట్ పత్రాన్ని రూపొందించాల్సిన పరిస్థితి. బ్యాలెట్ బాక్సులు కూడా అదే స్థాయిలో ఉండాలి. ఈ క్రమంలో గతంలో వినియోగించిన జంబో బాక్సులను వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు.
2010లో 5 నియోజకవర్గాల్లో
2010 ఉపఎన్నికల సమయంలో తెరాస పార్టీ ఈవీఎంలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కోరుట్ల, ఎల్లారెడ్డి, సిరిసిల్ల, హుజూరాబాద్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో 64 కన్నా ఎక్కువ మందిని బరిలో నిలిపింది. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 78 మంది అభ్యర్థులను పోటీకి దింపింది. అప్పట్లో వినియోగించిన ఈవీఎంలను 64 మందిలోపు పోటీలో ఉంటేనే వినియోగించేందుకు అవకాశం ఉంది. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆ అయిదు నియోజకవర్గాల్లో ఈవీఎంలు వినియోగించే అవకాశం లేక భారీ బ్యాలెట్ బాక్సులను అప్పటి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఐ.వి.సుబ్బారావు తయారు చేయించి వినియోగించారు.