తెలంగాణ

telangana

ETV Bharat / city

'ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు పెంపు 10 శాతం మించొద్దు' - ప్రైవేట్ స్కూల్స్‌లో ఫీజుల పెంపు

Private Schools Fee : రాష్ట్రంలో ఎడాపెడా ఫీజులు పెంచేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై రాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది. వాటిలో ఫీజుల పెంపు ఏటా 10 శాతానికి మించరాదని రాష్ట్ర మంత్రుల కమిటీ నిర్ణయించింది. కమిటీ తీర్మానాలపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించాక కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

Private Schools Fee hike
Private Schools Fee hike

By

Published : Mar 7, 2022, 9:04 AM IST

Private Schools Fee : ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల పెంపు ఏటా 10 శాతానికి మించరాదని మంత్రుల కమిటీ తీర్మానించింది. ‘గత ఏడాది వసూలు చేసిన ఫీజుపై 10 శాతం లోపు రుసుం పెంచుకోవచ్చు. దాన్ని పాఠశాలస్థాయి ఫీజుల కమిటీనే నిర్ణయించుకోవచ్చు’ అని పేర్కొంది. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, అన్ని ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమంపై విధివిధానాల రూపకల్పనకు 11 మంది మంత్రులతో ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఈ నెల 2న సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. ఆ సమావేశం తీర్మానాల కాపీ ఆదివారం బయటకు వచ్చింది. కమిటీ తీర్మానాలపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించాక కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

ఫీజు నిర్ణయానికి రెండు కమిటీలు

Private Schools Fee Hike : ఫీజులపై నిర్ణయానికి పాఠశాల స్థాయిలో ఒకటి, రాష్ట్ర స్థాయిలో మరొక కమిటీ ఉంటాయి. పాఠశాల స్థాయి కమిటీకి ఛైర్‌పర్సన్‌గా యాజమాన్యం నియమించిన ప్రతినిధి ఉంటారు. ప్రధానోపాధ్యాయుడు/ప్రధానోపాధ్యాయిని కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఆ పాఠశాలలో పనిచేసే ముగ్గురు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అయిదుగురు సభ్యులుగా ఉంటారు. వారంతా కలిసి ఫీజు ఎంత పెంచాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు. వారు నిర్ణయం తీసుకోలేకపోయినా? అభిప్రాయభేదాలు తలెత్తినా రాష్ట్రస్థాయి ఫీజుల కమిటీకి ప్రతిపాదించాలి. ఆ కమిటీకి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఛైర్‌పర్సన్‌గా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌, ప్రభుత్వం నియమించే విద్యావేత్త సభ్యులుగా ఉంటారు.

తీర్మానాల్లో ముఖ్యాంశాలు

  • Private Schools Fee Hike Issue : పాఠశాల ఆదాయ, వ్యయాల (ఆడిట్‌ చేసిన) వివరాలను, ప్రతిపాదిత ఫీజును విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే మూడు నెలల ముందు యాజమాన్యం.. ఫీజుల కమిటీకి సమర్పించాలి. నిర్ణయించిన ఫీజు వివరాలను పాఠశాల వెబ్‌సైట్లో ఉంచాలి.
  • ఫీజులను డిజిటల్‌, చెక్కులు తదితర విధానాల్లో నగదు రహిత మార్గాల్లో వసూలు చేయాలి.
  • అడ్మిషన్‌, ట్యూషన్‌ ఫీజు వసూలు తప్పనిసరి. రవాణా, భోజనం, ఎక్స్‌కర్షన్‌ తదితరాలు ఐచ్ఛికం.
  • విద్యార్థి తండ్రి లేదా అతని కుటుంబంలో సంపాదించే వ్యక్తి చనిపోతే ఫీజు చెల్లించలేదని ఆ విద్యార్థిని బయటకు పంపరాదు. అక్కడ చదువు పూర్తయ్యేవరకు ఉచితంగా చదివించాలి.

చిన్నారులకు ప్రిపరేటరీ తరగతి అవసరం

  • అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో 2 నుంచి 8వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను తెలుగు, ఆంగ్ల భాషల్లో ముద్రించాలి. మొదటి తరగతి పుస్తకాలు మాత్రం ఆంగ్లమాధ్యమంలోనే ఉంటాయి.
  • 1వ తరగతికి ముందు చిన్నారులకు ఏడాదిపాటు ఆంగ్ల మాధ్యమంలో ప్రిపరేటరీ తరగతిని ప్రవేశపెట్టాలి. అందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ, పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా విధివిధానాలు రూపొందించాలి.
  • సాధ్యమైనంత త్వరగా ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపట్టాలి.
  • బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని మళ్లీ ప్రారంభించాలి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నిర్వహించాలి.

ABOUT THE AUTHOR

...view details