తెలంగాణ

telangana

By

Published : Nov 2, 2019, 4:20 AM IST

Updated : Nov 2, 2019, 7:38 AM IST

ETV Bharat / city

ప్రమాణ పూర్వకంగా తప్పులు చెబుతారా?

ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో ఐఏఎస్ అధికారులు... తప్పుడు వివరాలతో తమనే మోసం చేస్తున్నారని హైకోర్టు మండిపడింది. ఐఏఎస్ అధికారులు ఇలా చేస్తారని ఊహించలేదని వ్యాఖ్యానించింది. మంత్రికి ఒక విధంగా.. తమకు మరో విధంగా ఎలా చెబుతారని ఆర్టీసీ ఇన్​ఛార్జి ఎండీని నిలదీసింది. ప్రమాణపత్రంలో కోర్టును తప్పుదోవ పట్టిస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలుసా అని హెచ్చరించింది. జీహెచ్ఎంసీ బకాయిలు చెల్లించకపోతే.. ప్రభుత్వానికి లేఖ ఎందుకు రాయలేదని ప్రశ్నించింది. బకాయిలు చెల్లించలేమని చెప్పే అధికారం జీహెచ్ఎంసీ కమిషనర్​కు ఎవరిచ్చారని సూటిగా అడిగింది.

ఆర్టీసీ ఇన్​ఛార్జి ఎండీపై హైకోర్టు అసహనం వ్యక్తం

ఆర్టీసీ ఇన్​ఛార్జి ఎండీపై హైకోర్టు అసహనం వ్యక్తం

ఆర్టీసీ సమ్మెపై విచారణ సందర్భంగా ఐఏఎస్ అధికారులు తమను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పొంతన లేని గజిగజి లెక్కలతో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడింది. సమ్మెకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. కోర్టుకు ఆర్టీసీ ఇన్​ఛార్జి ఎండీ సునీల్ శర్మ, ఆర్థిక సలహాదారు రమేశ్ హాజరయ్యారు. ప్రభుత్వం, ఆర్టీసీ చెల్లించాల్సిన బకాయిలపై ఆర్టీసీ ఇన్​ఛార్జి ఎండీ సమర్పించిన నివేదికపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.

ప్రభుత్వం బకాయిలన్నీ చెల్లించిందని.. ఇవ్వాల్సిందానికన్నా ఎక్కువే ఇచ్చిందని నివేదికలో ఆర్టీసీ ఎండీ పేర్కొన్నారు. బస్సుల కొనుగోళ్ల కోసం ఇచ్చిన 25 కోట్ల రూపాయలను కూడా బకాయిలు చెల్లించినట్లు ఎలా చెబుతారని హైకోర్టు ప్రశ్నించింది. ఇద్దరు ఐఏఎస్ అధికారులు అస్పష్టంగా నివేదికలు సమర్పించడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించింది. కోర్టుకు వివరాలు సమర్పించడం ఇలాగేనా.. కనీసం గణాంకాలు పరిశీలించరా అని నిలదీసింది.

బాధ్యత లేనప్పుడు జీహెచ్​ఎంసీ ఎందుకు ఇచ్చింది

జీహెచ్ఎంసీ 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాల్లో కలిపి 336 కోట్ల రూపాయలు చెల్లించిందని... లోటు బడ్జెట్ కారణంగా ఇక చెల్లించలేమని తెలిపిందని హైకోర్టుకు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ నివేదించారు. రెండు ఆర్థిక సంవత్సరాల్లో జీహెచ్ఎంసీ ఎలా చెల్లించిందని.. ఆ తర్వాతే ఆర్థిక ఇబ్బందులు వచ్చాయా అని హైకోర్టు ప్రశ్నించింది. చట్ట ప్రకారం జీహెచ్ఎంసీ తప్పనిసరిగా ఆర్టీసీకి చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్టీసీ ఎండీ వివరించారు. చట్టపరమైన బాధ్యత లేనప్పడు 336 కోట్లు ఎందుకు ఇచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ ద్వారా ఆర్టీసీకి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని... అలాంటప్పుడు తాము ఇవ్వలేమని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎలా చెబుతారని అడిగింది. జీహెచ్ఎంసీ ఇవ్వకపోతే... ఆ విషయం ప్రభుత్వానికి ఎందుకు తెలపలేదని ఆర్టీసీని ప్రశ్నించింది. తాము ఉత్తర్వులు జారీ చేశాకే ఆర్టీసీకి జీహెచ్ఎంసీ లేఖ రాసిందని... తాము ఆదేశాలు ఇచ్చిన తర్వాతే సమ్మె విషయం కేంద్రానికి ఆర్టీసీ ఎండీ రాశారని హైకోర్టు పేర్కొంది.

విచారణ ఈ నెల 7వ తేదీకి వాయిదా

ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి సుమారు 2వేల కోట్లు రావాల్సి ఉందని సెప్టెంబరు నెలలో అసెంబ్లీలో రవాణా శాఖ మంత్రి వెల్లడించారని... ఇప్పుడేమో బకాయిలన్నీ చెల్లించినట్లు ఆర్టీసీ కోర్టుకు చెబుతోందని హైకోర్టుకు కార్మిక సంఘాల తరఫు న్యాయవాది దేశాయ్ ప్రకాష్ రెడ్డి నివేదించారు. టికెట్ల ధరలు పెంచక పోయినప్పటికీ... డీజిల్ ధరలు పెరిగినప్పటికీ... రెవెన్యూ పెరుగుతోందని మంత్రి పేర్కొన్నారన్నారు. అసెంబ్లీలో మంత్రి ప్రకటన వివరాలు సమర్పించేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు. మంత్రికి ఒక తీరు.. తమకు మరో విధంగా ఎలా చెబుతారని ఆర్టీసీ ఇన్​ఛార్జి ఎండీపై హైకోర్టు మండిపడింది. న్యాయస్థానానికి సమర్పించే ప్రమాణ పత్రంలో తప్పుడు వివరాలు సమర్పిస్తే జరిగే పర్యవసానాలపై అవగాహన ఉందా అని హెచ్చరించింది. ఆర్టీసీ సమ్మెపై తదుపరి విచారణను ఈనెల 4వ తేదీన చేపడతామనగా... కేంద్రానికి లేఖ రాశామని.. ప్రతిస్పందన రావాల్సి ఉందని.. మరికొంత సమయం ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్ కోరారు. అంగీకరించిన ఉన్నత న్యాయస్థానం ఈనెల 7వ తేదీకి విచారణ వాయిదా వేసింది.

ఇవీ చూడండి: ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

Last Updated : Nov 2, 2019, 7:38 AM IST

ABOUT THE AUTHOR

...view details