Telangana High Court on Corona : తెలంగాణలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను ప్రజారోగ్య, పోలీస్ శాఖలు హైకోర్టుకు నివేదించాయి. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాస రావు, డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు నివేదికలు సమర్పించారు. ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హైకోర్టుకు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్రం అమలు చేస్తోందని వివరించారు. రాష్ట్రంలో ఈనెల 1 నాటికి 2.97 కోట్ల కరోనా పరీక్షలు చేశామన్నారు.
Telangana High Court on Corona: కొవిడ్ పరిస్థితిపై హైకోర్టుకు నివేదిక సమర్పించిన డీహెచ్, డీజీపీ - corona prevention measures in telangana
![Telangana High Court on Corona: కొవిడ్ పరిస్థితిపై హైకోర్టుకు నివేదిక సమర్పించిన డీహెచ్, డీజీపీ Telangana High Court on Corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14089681-thumbnail-3x2-a.jpg)
10:52 January 04
Telangana High Court on Corona : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ
ఆక్సిజన్ సదుపాయం పెరిగింది
రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 6,82,215 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. పాజిటివిటీ రేటు 2.29శాతం, మరణాల రేటు 0.5 శాతమని వివరించారు. 34 ప్రభుత్వ, 76 ప్రైవేట్ ఆర్టీపీసీఆర్, 1,231 రాపిడ్ పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. గత నెలలో రోజుకు సుమారు 35,129 పరీక్షలు చేశామని ఉన్నత న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సదుపాయం పెరిగిందని.. టీకా మొదటి డోసు 100శాతం, రెండో డోసు 69శాతం పూర్తైందని చెప్పారు.
కొత్త సంవత్సర వేడుకల్లో 907 కేసులు
Corona Cases in Telangana : కొత్త సంవత్సర వేడుకల్లో 907 కేసులు నమోదు చేశామని హైకోర్టుకు డీజీపీ నివేదించారు. వేళలకు మించి వేడుకలు నిర్వహించినందుకు 263 కేసులు.. పబ్లిక్ న్యూసెన్స్ చేసినందుకు 644 కేసులు నమోదు చేశామన్నారు. మాస్కులు పెట్టుకోని వారికి జరిమానాలు విధిస్తున్నామని.. గతనెల 24 నుంచి ఈనెల 2 వరకు 16,430 మందికి జరిమానాలు వేశామని ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. జూన్ 20 నుంచి డిసెంబరు 23 వరకు 5,10,837 మందికి జరిమానా వేశామని చెప్పారు. ఈనెల 10 వరకు సభలు, ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదన్న డీజీపీ.. జనం గుమిగూడకుండా పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు నియమించామని కోర్టుకు వివరించారు. కరోనా పరిస్థితులపై తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 7కి వాయిదా వేసింది.
- ఇదీ చదవండి :బూస్టర్ డోసు.. మహమ్మారిని ఎదుర్కొనే కొత్త ఆయుధం!