కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ప్రభుత్వం వివరించింది. మార్చి 23తో పోలిస్తే కరోనా కేసులు దేశవ్యాప్తంగా 1,142 రెట్లు పెరగగా.. తెలంగాణలో 497 రెట్లు పెరిగాయని పేర్కొంది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు జూన్ 29న 3,457 చేయగా... ఈనెల 25 నాటికి 15,654కి పెరిగాయని సర్కారు వివరించింది. పరీక్షల్లో కరోనా పాజిటివ్ శాతం 27.3 శాతం నుంచి 10.18శాతానికి తగ్గిందని వెల్లడించింది.
35,308 కేసులు
మాస్కులు, భౌతిక దూరం పాటించని వారిపై, నిబంధనలకు విరుద్ధంగా వివాహాలు, అంత్యక్రియలు, జనసమీకరణ చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారని నివేదికలో ప్రభుత్వం వివరించింది. మాస్కులు ధరించకుండా బహిరంగంగా తిరిగినందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 35,308 మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొంది. భౌతిక దూరం నిబంధనలు ఉల్లంఘించినందుకు 1,211 కేసులు నమోదయ్యాయయని తెలిపింది.