దళిత సాధికారత పథకం అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించిన సర్కారు... విధివిధానాల ఖరారుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్... ఇవాళ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ప్రగతిభవన్ వేదికగా జరిగే సమావేశంలో.... రాష్ట్రంలోని ఎస్సీ ప్రజాప్రతినిధులతో పాటు మజ్లిస్, భాజపా, సీపీఎం(CPM), సీపీఐ(CPI) పార్టీల నేతలను కేసీఆర్ ఆహ్వానించారు. సీనియర్ ఎస్సీ నేతలు కడియం శ్రీహరి, మందా జగన్నాథం, మోత్కుపల్లి నర్సింహులు, ఆరేపల్లి మోహన్, గడ్డం ప్రసాద్ కుమార్లు సమావేశానికి హాజరు కావాలని కోరారు. ఎస్సీల సంక్షేమం, అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా క్షుణ్ణంగా చర్చించి.... వారి అభిప్రాయలు తీసుకొని.... విధివిధానాలు ఖరారు చేయాలని సీఎం భావిస్తున్నారు.
ఎస్సీల వివక్షతపై సీఎం ఆవేదన...
కలెక్టర్లు, అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలోనూ.. దళిత సాధికారత పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆలోచనలు వివరించారు. శరీరంలోని ఓ భాగం పాడైతే ఆ శరీరానికి ఎంత బాధ ఉంటుందో.. సమాజంలో ఓ భాగం వివక్షకు గురైతే కూడా అంతే బాధగా ఉంటుందని సీఎం అన్నారు. మనలోనే భాగమై జీవిస్తున్న మనుషులను ఎస్సీల పేరుతో బాధపెట్టే వ్యవహారం మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్న ఎస్సీల అభివృద్ధిని... సమాజంలోని ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించిన రోజే ఎస్సీల సాధికారత సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్న సీఎం... ఇవాళ నిర్వహించే సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.