పాఠశాలల్లో తరగతులను ఆగస్టు మొదటి వారం నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కరోనా పరిస్థితుల కారణంగా నాలుగు నెలలుగా రాష్ట్రంలోని సుమారు 40 వేల బడులు మూత పడ్డాయి. జూన్ 1 నుంచి పలు కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు వివిధ యాప్ల ద్వారా ఆన్లైన్ తరగతులు మొదలుపెట్టాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మాత్రం ఇళ్లకే పరిమితమయ్యారు.
కరోనా పరిస్థితులు ఎన్నాళ్లకు చక్కబడతాయో స్పష్టత లేకపోవడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ బోధనా పద్ధతులపై అధ్యయనం చేసేందుకు ఈనెల 3న విద్యాశాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా గ్రామీణ, పేద విద్యార్థులకు ఇళ్ల వద్దకే విద్య ఎలా అందించాలనే అంశంపై కమిటీ అధ్యయనం చేసింది. దాదాపు అందరి ఇళ్లల్లో టీవీలు ఉన్నందున.. వాటి ద్వారా పాఠాలు బోధించాలని ఆ కమిటీ సూచించింది. ఒకరిద్దరు విద్యార్థులకు ఆ సౌకర్యం లేనట్లయితే.. పాఠశాలలు, పంచాయతీ కార్యాలయంలోని టీవీలను ఉపయోగించాలని సిఫార్సు చేసింది. దూరదర్శన్ యాదగిరి, టీ-శాట్ విద్య ఛానెళ్ల ద్వారా పాఠాలు ప్రసారం చేయనున్నారు. అవసరమైతే స్థానిక కేబుల్ టీవీలను ఉపయోగించాలని భావిస్తున్నారు.
ఆరో తరగతి నుంచి..
టీవీల ద్వారా 6 నుంచి 10 తరగతుల వరకు రోజుకు నాలుగు గంటల పాటు పాఠాలను బోధించాలని ఆలోచిస్తున్నారు. టీ-శాట్లో ప్రత్యేక ఛానెల్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని విద్యా శాఖ ప్రభుత్వాన్ని కొరనుంది.