తెలంగాణ

telangana

By

Published : Jul 4, 2021, 5:27 PM IST

Updated : Jul 4, 2021, 6:34 PM IST

ETV Bharat / city

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ

TELANGANA GOVERNMENT LETTER TOP KRMB
TELANGANA GOVERNMENT LETTER TOP KRMB

17:25 July 04

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ

తెలంగాణ ప్రభుత్వం తన హక్కుగా వచ్చిన నీటితోనే చట్టం, ట్రైబ్యునల్ ఆదేశాలకు లోబడి శ్రీశైలం వద్ద విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని... ఇందులో ఆంధ్రప్రదేశ్​కు ఎలాంటి అభ్యంతరాలు అక్కర్లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఓ అభిప్రాయానికి రావాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డును కోరింది. ఈ మేరకు బోర్డు ఛైర్మన్​కు నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ లేఖ రాశారు.  

శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి ఆపాలన్న బోర్డు లేఖకు స్పందనగా లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టు ప్రధానంగా జలవిద్యుత్ ప్రాజెక్టు అని, కృష్ణా జలాల మొదటి ట్రైబ్యునల్ ప్రకారం.. శ్రీశైలం జలాలను బేసిన్ వెలుపలకు తరలించే హక్కు ఆంధ్రప్రదేశ్​కు లేదని అందులో పేర్కొన్నారు. 1990-91 నుంచి 2019-20 వరకు ఏప్రిల్, మే నెలల్లో ఏనాడూ శ్రీశైలంలో 834 అడుగుల పైన నీటి మట్టం ఉండేలా ఏపీ చూడలేదని... ఇప్పుడు మాత్రం బేసిన్ వెలుపలకు నీటిని తరలించాలని 854 అడుగుల పైన నీటి మట్టం ఉండాలని అంటోందని పేర్కొన్నారు. కృష్ణా డెల్టా అవసరాల కోసం 760 అడుగుల వరకు కూడా నీటిని వదిలేలా 2013లో ఏపీ ప్రభుత్వం మెమో జారీ చేసిందని గుర్తు చేశారు. 

గత రెండేళ్లుగా 170, 124 టీఎంసీల నీటిని తరలించిన ఆంధ్రప్రదేశ్...  చెన్నై తాగునీటి కోసం కనీసం 10 టీఎంసీలు కూడా సరఫరా చేయలేదని తెలిపారు. 2020-21లో ఏపీ ఏకంగా 629 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకొందన్న ఈఎన్సీ... జూన్ పదో తేదీ నాటికి ఏపీలోని పెన్నా బేసిన్ జలాశయాల్లో 95 టీఎంసీల నీరు, మొత్తంగా పెన్నా సహా ఇతర బేసిన్లలో 360 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని వివరించారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తే నష్టం జరుగుతుందన్న ఏపీ వాదన నిరాధారమైనదని అన్నారు. 50 శాతం నిష్పత్తిలో విద్యుత్ పంపకాలు చేయాలని విభజన చట్టంలో ఎక్కడా లేదని, ముందు చేసుకున్న అవగాహన కేవలం ఆ ఏడాదికి మాత్రమే వర్తిస్తుందని ఈఎన్సీ తెలిపారు.  

ప్రణాళికా సంఘం నివేదిక, కృష్ణా మొదటి ట్రైబ్యునల్ తీర్పునకు లోబడే సాగర్​లో క్యారీ ఓవర్ స్టోరేజ్ ఉండేలా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని వివరించారు. శ్రీశైలంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలు నిరాధారమైనవని, అసంబద్ధమైనవని తోసిపుచ్చారు. శ్రీశైలంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి వల్ల తాగునీరు, సాగునీటి ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్న ఏపీ వాదనలు సత్యదూరమని... ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని లేఖలో వివరించారు. తెలంగాణ తన వాటా నీటిని విచక్షణ, అవసరాల మేరకు ఉపయోగించుకుంటుందని... ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్​కు ఎలాంటి అభ్యంతరాలు అక్కర్లేదని స్పష్టం చేశారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఒక అభిప్రాయానికి రావాలని కృష్ణా బోర్డు ఛైర్మన్​ను కోరారు.

ఇదీచూడండి:REVANTH REDDY: 'కృష్ణా జలాలను కాపాడటం కంటే సీఎం కేసీఆర్​కు పనులేమున్నాయి'

Last Updated : Jul 4, 2021, 6:34 PM IST

ABOUT THE AUTHOR

...view details