తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆయిల్​పామ్​ పంటపై సర్కారు ఫోకస్​.. 2 లక్షల ఎకరాల్లో సాగుకు వ్యూహం

Oil Palm Cultivation in Telangana: రాష్ట్రంలో ఆయిల్‌పామ్​ పంట సాగుపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ ఆయిల్‌పామ్​, ముడి నూనెల మిషన్ కింద సమగ్ర విధానంలో రైతులతో సాగు చేయించేందుకు వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంటోంది. పలు జిల్లాల్లో నర్సరీలు సిద్ధం చేస్తున్నందున రాబోయే వానాకాలంలో 2 లక్షల ఎకరాల్లో నాటేందుకు ఉద్యానశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

By

Published : Feb 18, 2022, 11:41 AM IST

Oil Palm Cultivation in Telangana
తెలంగాణలో ఆయిల్​ పామ్​ సాగు

రాష్ట్రంలో ఆయిల్‌పాం పంట సాగుపై సర్కారు ప్రత్యేక దృష్టి

Oil Palm Cultivation in Telangana: రాష్ట్రంలో ఆయిల్‌పామ్​ పంట సాగు ప్రోత్సాహంపై ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. పంట సాగుకు పుష్కలమైన అవకాశాలున్న దృష్ట్యా ఉద్యానశాఖ చర్యలు ఊపందుకున్నాయి. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్​ సాగు చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. అందులో భాగంగా ఇప్పటికే 26 జిల్లాల్లోని నర్సరీల్లో నాణ్యమైన మొక్కలు సిద్ధం చేస్తున్నారు. 11 కంపెనీలు సేవలందించేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో... వానాకాలంలో రెండున్నర లక్షల ఎకరాల్లో మొక్కలు నాటేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ఆ పథకం విఫలం

గతంలో దేశానికి అవసరమైన వంట నూనెల లోటు అధిగమించేందుకు నూనెగింజల పంట సాగు, విస్తీర్ణం పెంచాలని 1990లో కేంద్రం నేషనల్ ఆయిల్‌పాం మిషన్‌ ప్రవేశపెట్టింది. ఈ మిషన్ కింద 40 నుంచి 50 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేయాలన్నది లక్ష్యం. అప్పట్లో పెద్ద ఎత్తున నిధులు వెచ్చించినా విధివిధానాలు లోపభూయిష్టంగా ఉండటం వల్ల పథకం విఫలమైంది. గత అనుభవాల దృష్ట్యా 2021లో ప్రధాని నరేంద్ర మోదీ... నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్, ఆయిల్‌పామ్​ ప్రవేశపెట్టారు. ఈ మిషన్ కింద 2025 నాటికి దేశవ్యాప్తంగా 6.5 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్​ సాగులోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆయిల్‌పామ్​ ఉత్పత్తిలో తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ఉద్యానశాఖ కృషి చేస్తోంది.

"దేశానికి ఆయిల్​ పామ్​ అందించే జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. సత్ఫలితాలనిస్తే ఆయిల్​ పామ్​ను అత్యధికంగా దిగుమతి చేసుకునే అవసరం లేకుండా.. రాష్ట్రం నుంచే 40 లక్షల మెట్రిక్​ టన్నులు ఎగుమతి చేసేలా దృఢసంకల్పంతో కృషి చేస్తున్నాం. ఆ మేరకు ఇప్పటివరకు రెండున్నర లక్షల ఎకరాల వరకూ మొక్కలు సిద్ధం చేసుకున్నాం." -వెంకటరామిరెడ్డి, ఉద్యానశాఖ కమిషనర్‌

వాటిపై కూడా ఫోకస్​

ఆయిల్‌పామ్​ సాగుకు బంగారు భవిష్యత్తు ఉన్నందున ఔత్సాహిక రైతుల క్షేత్రాల్లో శ్రీ గంధం, టేకు మొక్కలు సైతం నాటించాలని ఉద్యానశాఖ సన్నాహాలు చేస్తోంది. 30 ఏళ్లపాటు ప్రతి నెలా ఆదాయం ఇచ్చే ఆయిల్‌పామ్​తోపాటు.. ఆ పంట కాలం ముగిసే సమయానికి శ్రీ గంధం, టేకు ద్వారా నికర ఆదాయం లభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఇదీ చదవండి:'పోషకాలున్న బియ్యమే తీసుకుంటాం'.. ధాన్యం సేకరణపై ఎఫ్​సీఐ క్లారిటీ

ABOUT THE AUTHOR

...view details