పల్లెసీమల రూపు రేఖలు మార్చడమే లక్ష్యంగా పల్లెప్రగతి కార్యక్రమాన్ని ఇప్పటి వరకు రెండు దఫాల్లో అమలు చేశారు. రెండు విడతల పల్లెప్రగతి పురోగతిని రేపు జరగనున్న కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ సమీక్షించనున్నారు. ప్రధానంగా పచ్చదనం, పారిశుద్ధ్యం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులకు సంబంధించి గ్రామాల్లో పరిస్థితులను సీఎం కేసీఆర్ తెలుసుకోనున్నారు. పల్లెప్రగతికి సంబంధించి ఏర్పాటు చేసిన ఆకస్మిక తనిఖీ బృందాల్లోని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు... తమ పరిశీలనలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వాటిపై కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. పల్లెప్రగతి స్ఫూర్తిని నిరంతరం కొనసాగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయనున్నారు.
త్వరలో పట్టణ ప్రగతి
పురపాలక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో త్వరలోనే పట్టణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పట్టణప్రగతిని పూర్తి స్థాయిలో విజయవంతం చేసి పట్టణాల రూపురేఖలు మార్చేందుకు క్రియాశీలక పాత్ర పోషించాలని కోరనున్నారు. కొత్త పురపాలక చట్టంలో జిల్లా కలెక్టర్లకు ప్రత్యేకాధికారాలు ఉన్నాయి. నూతన చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.