తెలంగాణ

telangana

ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసే వరకు అక్కడే ఉండాలి : సీఎం కేసీఆర్

By

Published : Mar 5, 2021, 6:42 AM IST

పట్టభద్ర స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసే వరకూ ఏమాత్రం ఏమరుపాటుగా ఉండొద్దని తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. గురువారం యాదాద్రి పర్యటన అనంతరం హైదరాబాద్‌ చేరుకున్న కేసీఆర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు.

CM KCR review on graduate elections
పట్టభద్రుల ఎన్నికలపై సీఎం కేసీఆర్ సమీక్ష

‘‘రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల పరిధిలోని మంత్రులు, ఇన్‌ఛార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయా జిల్లాల్లో, వారి వారి నియోజకవర్గాల్లోనే ఉండి ప్రచారం నిర్వహించాలి. పార్టీ అభ్యర్థులు సురభివాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిల విజయానికి కృషి చేసేలా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలి’’ అని స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగే ఆరు ఉమ్మడి జిల్లాల మంత్రులతో పాటు ఆయా జిల్లాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఫోన్‌లో మాట్లాడారు.

‘‘77 నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యమైనవిగా భావించాలి. ఎన్నికలు మరో పది రోజులే ఉన్నాయి. అత్యవసరమైతే తప్ప ఆ జిల్లాలు, నియోజకవర్గాలను విడిచి రావద్దు. ప్రచారంలో మిగిలిన వారి కంటే ఎంతో ముందున్నాం. అదే ఒరవడి కొనసాగాలి. మంత్రులు పూర్తి సమన్వయంతో వ్యవహరించాలి. జిల్లా స్థాయిలో సమీక్షలు జరపాలి. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బాధ్యతలు తీసుకోవాలి. ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రచారంలో ముందు నడవాలి’’ అని కేసీఆర్‌ సూచించారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రతి 50 మంది ఓటర్లకో ఇన్‌ఛార్జి చొప్పున మొత్తం 3,400 మందిని నియమించి నగరంలోని 1,53,383 మంది ఓటర్లను కలుసుకునేలా కార్యాచరణ అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే 90 శాతం ఓటర్లను పార్టీ శ్రేణులు కలిశాయని, మిగిలిన పదిశాతం ఓటర్లను సైతం వెంటనే కలవాలని, వీలైతే రెండుమూడు సార్లు కూడా కలిసి పార్టీ అభ్యర్థుల గెలుపు ప్రాధాన్యాలను వివరించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా వాటి పరిధిలోని జిల్లాల్లో తెరాస సభ్యత్వ నమోదు గడువును పొడిగించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది.

ABOUT THE AUTHOR

...view details