తెలంగాణ

telangana

By

Published : Sep 9, 2019, 9:09 PM IST

ETV Bharat / city

ఆర్థిక మాంద్యం తీవ్ర ప్రభావం చూపింది: సీఎం కేసీఆర్

దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం తెలంగాణపై గణనీయంగా పడిందని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆవేదన వ్యక్తం చేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.1,46,492.3 కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్​ పద్దను అసెంబ్లీలో సీఎం ప్రవేశపెట్టారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు కేసీఆర్​ తెలిపారు.

సీఎం కేసీఆర్

తెలంగాణ బడ్జెట్

దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్​ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.1,46,492.3 కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్​ పద్దును అసెంబ్లీలో సీఎం ప్రవేశపెట్టారు. గత ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టిన ఓటాన్​ అకౌంట్ బడ్జెట్​ గడువు ఈనెల 30న ముగియనుండటంతో ఇవాళ పూర్తి స్థాయి బడ్జెట్​ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో తాను ఈ బడ్జెట్​ ప్రవేశాపట్టాల్సి వస్తున్నందుకు చింతిస్తున్నానని కేసీఆర్​ తెలిపారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు రెండేళ్లలో జీఎస్​డీపీ సగటు వృద్ధి రేటు కేవలం 4.2 శాతం ఉంటే... 2018-19లో 10.5 శాతంగా నమోదైందని స్పష్టం చేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఎంత దృఢంగా మారిందో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనమన్నారు.

రాష్ట్రాభివృద్ధి, ఆస్తుల కల్పన కోసం వెచ్చించే మూలధన వ్యయంలో ఎక్కడో అట్టడుగున ఉండే తెలంగాణ... నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో మూలధనవ్యయం మెుత్తం వ్యయంలో కేవలం 11.2 శాతం మాత్రమే. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన అనంతరం... ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల గడిచిన ఆర్థిక సంవత్సరంలో 16.9 శాతం మూలధన వ్యయంతో రాష్ట్రం దేశంలోనే మెుదటి వరుసలో నిలిచిందని సీఎం పేర్కొన్నారు.

ఆర్థిక మాంద్యం ప్రభావం అన్ని రంగాలపైన చూపుతోందని కేసీఆర్ తెలిపారు. ప్రధానంగా ఆటోమెుబైల్​ రంగంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. మాంద్యం కారణంగా చాలా పరిశ్రమలు మూత పడటంతో గనుల్లో బొగ్గు ఉత్పత్తి ఆపేయాల్సి వచ్చిందన్నారు. రూపాయ మారకం విలువ శరవేగంగా పతనమవుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఆదాయభివృద్ధి 15 శాతం సాధ్యమని ఆశించినా... కేవలం 5.46 శాతం వృద్ధిరేటు మాత్రమే సాధ్యమైందని తెలిపారు. అలాగే వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మోటార్​ వాహనాల ట్యాక్స్​లో ఆశించిన వృద్ధి సాధించలేకపోయమని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ప్రధానంగా రైతుబంధు, రైతుబీమా, రుణామాఫీ, ఆసరా పింఛన్లు, విద్యుత్​ రాయితీ, కల్యాణలక్ష్మి, గ్రామ పంచాయతీ, పురపాలక, బియ్యం రాయితీ రంగాలకు... కేటాయింపులో అధిక ప్రాధాన్యం కల్పించారు. ఆర్థిక మాంద్యం కారణంగా ఆదాయాలు తగ్గినప్పటికీ పరిస్థితిలో తప్పకుండా మార్పు వస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఆర్థిక పరిస్థితి మెరుగపడితే దానికి అనుగుణంగా అంచనాలను సవరించుకొనే వెసులుబాటు కూడా తమకు ఉందని కేసీఆర్​ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: బడ్జెట్​: సంక్షేమం, నీటి పారుదలకు పెద్దపీట

ABOUT THE AUTHOR

...view details