తెలంగాణ

telangana

అసెంబ్లీ సమావేశాల్లో కాగిత రహితం.. సిబ్బంది పరిమితం!

By

Published : Sep 2, 2020, 7:27 AM IST

వైరస్‌ తీవ్రత నేపథ్యంలో అసెంబ్లీ నిర్వహణకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రద్దీ లేకుండా చర్యలు తీసుకోనుంది. అధికారులు, సిబ్బందిని నియంత్రించనున్నారు. కొంత మందికే పాస్‌లను జారీ చేస్తారు. చర్చకు సంబంధించిన అధికారులను మాత్రమే పిలిచే అవకాశం ఉంది. సభా కార్యకలాపాల్లో సాధ్యమైనంత మేరకు కాగితాల వినియోగాన్ని నివారించే ప్రయత్నం చేస్తారు.

telangana assembly
telangana assembly

కరోనా నిబంధనలకు అనుగుణంగా ఈ నెల ఏడో తేదీ నుంచి శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించనున్నారు. వైరస్‌ తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. వీలైనంత మేరకు రద్దీ లేకుండా చర్యలు తీసుకోనుంది. సందర్శకులను ఈ సమావేశాలకు అనుమతించరని తెలుస్తోంది. అధికారులు, సిబ్బందిని నియంత్రించనున్నారు. కొంత మందికే పాస్‌లను జారీ చేస్తారు. గతంలో సమావేశాల సందర్భంగా అ న్ని శాఖల అధికారులు హాజరయ్యేవారు. ఈ సారి చర్చకు సంబంధించిన అధికారులను మాత్రమే పిలిచే అవకాశం ఉంది.

సభా కార్యకలాపాల్లో సాధ్యమైనంత మేరకు కాగితాల వినియోగాన్ని నివారించే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వ శాఖల నుంచి సమాచారాన్ని కాగితాలు, దస్త్రాల రూపంలో కాకుండా మెయిల్‌, వాట్సాస్‌ తదితర ఆన్‌లైన్‌ మార్గాల ద్వారా సేకరిస్తారని తెలుస్తోంది. ఈ నెల నాలుగో తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్ని శాఖల కార్యదర్శులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు.

శాసనసభ ప్రాంగణంలో శానిటైజర్‌ను అందుబాటులోకి తెస్తారు. సభ బయట, లోపల బహుళ వినియోగ యంత్రాలను ఏర్పాటు చేస్తారు. ఒకే యంత్రంలో స్కానింగ్‌, శానిటైజర్‌, వైరస్‌ను అడ్డుకునే యూవీ పరికరం అమర్చి ఉంటాయి. సమావేశాలను పురస్కరించుకొని శాసనసభ, మండలి భవనాలలో సోమవారం నుంచే సోడియం హైపోక్లోరైడ్‌ను పిచికారి చేయిస్తున్నారు. ఉభయ సభల్లో భౌతిక దూరం కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. స్పీకర్‌, మండలి ఛైర్మన్‌లు.. సభల నిర్వహణపై ఒకటి, రెండు రోజుల్లో ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ABOUT THE AUTHOR

...view details