ఏపీలోని మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి దారుణమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. దాడుల విషయంలో పోలీసులు, సీఎం జగన్ లాలూచీ పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రమేయంతోనే తమ పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు జరిగాయన్నారు. పార్టీ కార్యాలయం రాజకీయ పార్టీలకు దేవాలయం లాంటిదని.. పార్టీ కార్యాలయాలపై దాడులను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. డీజీపీ కార్యాలయం పక్కనే తెదేపా కార్యాలయం ఉన్నా.. పోలీసులు పట్టించుకోలేదని.. దాడి జరిగితే నిఘా విభాగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రణాళిక ప్రకారమే రాష్ట్రవ్యాప్తంగా వైకాపా శ్రేణులు దాడులకు తెగపడ్డారని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి, డీజీపీ కలిసే దాడి చేయించారని ధ్వజమెత్తారు.
ఈ దాడులు.. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తారా. చంద్రబాబు రేపు రాష్ట్ర బంద్ పాటిస్తున్నాం. అనేక రాష్ట్రాల్లో గంజాయి స్మగ్లర్లను పట్టుకున్నారు. రాష్ట్రంలో గంజాయి సాగు పెరుగుతోందని అందరూ చెప్పారు. ప్రజల పన్నుతో జీతం తీసుకునే డీజీపీ నేరస్థులతో లాలూచీ పడతారా ?. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలం. రాష్ట్రంలో 356 అధికరణం ఎందుకు ప్రయోగించకూడదు ?.- చంద్రబాబు
ప్రజలంతా కలిసి రావాలి
ప్రజాస్వామ్యంపై దాడి చేసే శక్తులపై పోరాటం చేద్దామని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలంతా కలిసి రావాలన్నారు. మీరు చేసే తప్పుడు పనులపై మాట్లాడే స్వేచ్ఛ మాకు లేదా ? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. గృహ దిగ్బంధం చేసే అధికారం మీకు ఎవరిచ్చారని ప్రశ్నించారు.