తెలంగాణ

telangana

ETV Bharat / city

భూ హక్కుదారులకు తిరుగుడు తిప్పలు - tahasildar office issues with common man for any changes in passbook

పాలనను ప్రజలకు చేరువ చేయాలని సీఎం కేసీఆర్‌ కొత్త మండలాలు ఏర్పాటు చేయగా.. పాసుపుస్తకాల కోసం జేబు, ఒళ్లుగుల్ల చేసుకుని తిరుగుతున్న పరిస్థితి ఈ ప్రాంతవాసులది. సాంకేతిక సేవలు అందుబాటులోకి వచ్చినా రెవెన్యూశాఖ నిర్లక్ష్యం రైతులపాలిట శాపంగా మారుతోంది. ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల జిల్లాల్లో 100కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తేగాని... పనికాని పరిస్థితి ఏర్పడింది.

భూ హక్కుదారులకు తిరుగుడు తిప్పలు
భూ హక్కుదారులకు తిరుగుడు తిప్పలు

By

Published : Dec 20, 2019, 11:22 AM IST

Updated : Dec 20, 2019, 11:29 AM IST

ఏళ్ల తరబడి సాగుచేస్తున్న భూములకు హక్కులు పొందాలంటే కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేయకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లూ తహసీల్దారు కార్యాలయాల నుంచి పాసుపుస్తకాలు పొందే వెసులుబాటు ఉండేది. ధరణి (టీఎల్‌ఆర్‌ఎంఎస్‌) పుణ్యమా అని.. కొన్నిరకాల ఐచ్ఛికాలు (ఆప్షన్స్‌) తహసీల్దార్ల పరిధి నుంచి తొలగించారు. ఇప్పుడిదే పేద రైతులపాలిట సమస్యగా మారింది. సర్వే నంబర్లు తప్పిపోవడం, ఆర్‌ఎస్‌ఆర్‌ ఖాతా సమస్యలు, ఓఆర్‌సీ జారీ(భూమి హక్కు ధ్రువీకరణ పత్రం), విస్తీర్ణాల్లో తేడాలు లాంటి సమస్యలను పరిష్కరించడం తహసీల్దార్ల పరిధిలో లేదు. తహసీల్దారు కార్యాలయాలకు వచ్చిన రైతులను ఆర్డీవో, కలెక్టరేట్లకు వెళ్లాలంటూ చెబుతున్నారు.

రైతుబంధు, రైతుబీమా రావట్లేదు...

రాష్ట్రవ్యాప్తంగా పాసుపుస్తకాలు చేరని మూడున్నర లక్షల రైతులతోపాటు జారీచేసిన పుస్తకాల్లో తప్పులు, ఇతర పొరపాటు దొర్లిన వారు మానసిక వ్యథ అనుభవిస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా వర్తించడం లేదు. బ్యాంకు రుణాలకూ రైతులు దూరమయ్యారు. సాంకేతికాభివృద్ధి ఫలాలు పేదలు, సామాన్యుల కష్టాలు తీర్చాలి. దీనికి భిన్నంగా రెవెన్యూశాఖ రూపొందించిన కొత్త సాంకేతికత పేద రైతుల జేబు గుల్ల చేస్తోంది. తహసీల్దారు కార్యాలయం పరిధి నుంచి భూదస్త్రాలు, పాసుపుస్తకాల సవరణకు సంబంధించిన పలు అంశాలను ఆర్డీవో, సంయుక్త కలెక్టర్లకు అప్పగించారు. వారు ఆమోదం తెలిపితేనే పరిష్కారమయ్యేలా విధానం తీసుకొచ్చారు. దీంతో చిన్న సవరణలనూ తహసీల్దార్లు చేయలేని పరిస్థితి.

భూముల నిర్వహణ పూర్తి బాధ్యత తహసీల్దార్​ది కాదిప్పుడు..

వాస్తవానికి రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌(ఆర్‌ఓఆర్‌) చట్టం ప్రకారం భూముల నిర్వహణకు పూర్తి బాధ్యత తహసీల్దారే. కొన్నిచోట్ల తహసీల్దారు కార్యాలయాల్లో జరిగిన తప్పులను దృష్టిలో పెట్టుకుని ఆర్డీవో, సంయుక్త కలెక్టర్ల నుంచి సవరణలకు ఆమోదం తీసుకునే పరిస్థితి ప్రవేశపెట్టారు. తీరికలేని విధులతో నెలల తరబడి ఈ సమస్యల పరిష్కారం నిలిచిపోతోంది.

తహసీల్దార్లకే ఆప్షన్లు ఇవ్వాలి...

గ్రామస్థాయిలో రైతులు తహసీల్దారు కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యాన్నే ఎత్తిచూపుతున్నారు. ధరణి పోర్టల్‌లో తహసీల్దార్లకు ఐచ్ఛికాలు ఇస్తే చివరి దశలో ఉన్న పాసుపుస్తకాల పంపిణీ, సమస్యలన్నీ పరిష్కారమవుతాయని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం(ట్రెసా) రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
పోర్టల్‌లో తహసీల్దార్లకు ఇవ్వాల్సిన ఐచ్ఛికాలివే

బేస్‌ సర్వే నంబర్లలోని విస్తీర్ణంలో మార్పులు

  • సేత్వారీ ఎంట్రీ
  • ఖాతా అన్‌సైనింగ్‌
  • సర్వే నంబర్‌ తొలగింపు, చేర్పు
  • ఆధార్‌ నంబర్‌ సరిచేయడం, తప్పుడు ఫొటోల మార్పు
  • కులం, విస్తీర్ణంలో తప్పుపడితే సరిచేయడం
  • లింగం మార్పు
  • పట్టాదారు, తండ్రి, భర్త పేర్లు సరిచేయడం
  • సర్వే నంబర్‌ను ఒక ఖాతానుంచి మరో ఖాతాకు బదిలీ చేయడం.
Last Updated : Dec 20, 2019, 11:29 AM IST

ABOUT THE AUTHOR

...view details