తెలంగాణ

telangana

ETV Bharat / city

Super Speciality Hospitals: సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు ఎక్కడ కడదాం..? - Telangana Government latest news

గ్రేటర్ హైదరాబాద్​లోని పేద ప్రజలు వైద్యం విషయంలో ఇబ్బందులు పడకూడదని... ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నలుమూలల ఎక్కడిక్కడ సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అందులో భాగంగానే నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపడుతోంది. ఆ ఆసుపత్రుల నిర్మాణ స్థలాలను ఇవాళ మంత్రులు ప్రశాంత్​రెడ్డి, తలసాని, మల్లారెడ్డి, శ్రీనివాస్​గౌడ్​లు పరిశీలించారు.

Super Speciality Hospital
హైదరాబాద్‌లో మంత్రులు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి స్థలాల పరిశీలన

By

Published : Aug 3, 2021, 6:11 PM IST

Updated : Aug 3, 2021, 7:18 PM IST

సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాల కోసం మంత్రుల స్థల పరిశీలన

గ్రేటర్​ నలుమూలల ఆధునాతనమైన ఆసుపత్రులను నిర్మించి.. నిరుపేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం (Telangana Government) భావిస్తోంది. ఇప్పటికే గాంధీ, ఉస్మానియా, నీలోఫర్​, నిమ్స్ వంటి ఆసుపత్రులు నగరం నడిబొడ్డున ఉండి పేద ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. అవన్నీ కూడా గ్రేటర్ పరిధిలో 20 లక్షల జనాభా ఉన్నప్పుడు నిర్మించిన ఆసుపత్రులు. ప్రస్తుతం నగర జనాభా కోటికి పైగా పెరిగిపోయింది. దీంతో మరిన్ని ఆసుపత్రులు వస్తేనే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందవచ్చని సీఎం కేసీఆర్ ఆలోచన చేశారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం ఇటీవలే నిర్మించిన గచ్చిబౌలీలోని టిమ్స్ ఆసుపత్రిలో కొవిడ్-19 సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.

తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతో అత్యాధునిక ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి వద్ద, అల్వాల్ వద్ద, ఎల్బీనగర్​లోని గడ్డి అన్నారం వద్ద టిమ్స్ ఆసుపత్రులను (Super Speciality Hospitals) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి స్థలాన్ని, అల్వాల్ వద్ద ఉన్న స్థలాన్ని మంత్రులు ప్రశాంత్ రెడ్డి(Prashanth Reddy) , తలసాని శ్రీనివాస్ యాదవ్​లు (Talasani Srinivas Yadav)పరిశీలించారు. ఈ ఆసుపత్రుల నిర్మాణాన్ని ఆర్ అండ్ బీ (R AND B) అధికారులు చూసుకుంటున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.

సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంపై (Super Speciality Hospitals) సంబంధిత వైద్యాధికారులతో మంత్రులు సమీక్షించారు. త్వరలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన కోసం చేయాల్సిన ఏర్పాట్లపైనా సమీక్షించారు. అల్వాల్‌, గడ్డిఅన్నారం వెళ్లిన మంత్రులు.. అక్కడ కూడా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలకు పరిస్థితులు ఏమేరకు అనువుగా ఉన్నాయో ప్రత్యక్షంగా పరిశీలించారు. నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రికి (CM KCR) అందజేస్తామని మంత్రులు (MINISTERS) తెలిపారు.

సికింద్రాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్థల పరిశీలన చేసినట్లు పేర్కొన్నారు. ​ గడ్డి అన్నారంలో సకల సౌకర్యాలతో టిమ్స్​ ఆసుపత్రిని నిర్మిస్తామని రాష్ట్ర మంత్రులు స్పష్టం చేశారు. ఇక్కడి పండ్ల మార్కెట్​ను కొహెడకు తరలించి.. ఆ స్థలంలో రూ.2వేల కోట్ల వ్యయంతో సూపర్ స్పెషాలిటీ నిర్మించనున్నట్లు మంత్రులు వేముల ప్రశాంత్​రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్ నగరం నలుదిశలా నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దాంట్లో భాగంగా ఇవాళ ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రి, అల్వాల్‌, గడ్డిఅన్నారంలో స్థలాల పరిశీలన చేశాం. నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్​కు అందజేస్తాం.

-వేముల ప్రశాంత్​రెడ్డి, రాష్ట్ర మంత్రి

కంటోన్మెంట్ పరిధిలో బొల్లారంలోని భారతీయ విద్యాభవన్​కు లీజు ప్రాతిపదికన ఇచ్చిన స్థలంలో అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సాయన్న, జిల్లా కలెక్టర్ శ్వేతా, సంబంధిత అధికారులతో కలిసి ఆయన స్థల పరిశీలన చేశారు. హైదరాబాద్ చుట్టూ ప్రాంత ప్రజలకు వైద్యం అందే విధంగా గచ్చిబౌలి టిమ్స్​, సనత్ నగర్ టిమ్స్​, అల్వాల్ టిమ్స్​, ఎల్బీనగర్ టిమ్స్​ అని 4 వైద్యశాలలు ఏర్పాటు చేసే విధంగా స్థల పరిశీలన చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ప్రధాన ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తాము స్థల పరిశీలన చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.

Last Updated : Aug 3, 2021, 7:18 PM IST

ABOUT THE AUTHOR

...view details