తెలంగాణ

telangana

By

Published : Jun 1, 2022, 8:45 AM IST

ETV Bharat / city

"ఎమ్మెల్సీ అనంతబాబు.. మా కాలు, చెయ్యి తీసేస్తానన్నాడు"

MLC Anantababu: మాజీ డ్రైవర్‌, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంత బాబుపై.. సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ.. తమ కాలు, చెయ్యి తీసేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాలను పోలీసులు తమ రిమాండ్‌ రిపోర్టులో పొందుపరిచారు. అంతే కాదు.. రూ.రెండు లక్షలు ఇస్తానని, మృతదేహాన్ని తీసుకుపోవాలని, లేదంటే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు.

MLC Anantababu latest news
MLC Anantababu latest news


MLC Anantababu: ‘వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు.. కాలు, చెయ్యి తీసేస్తానని మమ్మల్ని బెదిరించాడు. రూ.రెండు లక్షలు ఇస్తాను... మృతదేహాన్ని తీసుకుపోవాలి. లేదంటే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు..’ అని మృతుడు సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ విషయాలను పోలీసులు తమ రిమాండ్‌ రిపోర్టులో పొందుపరిచారు.

మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుపై తయారు చేసిన రిమాండ్‌ రిపోర్టులో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కాకినాడలోని ప్రత్యేక మొబైల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌/ఆరో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ముందు మే 23న డీఎస్పీ ఆ రిమాండ్‌ రిపోర్టు ఉంచారు. మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీగా అనంత ఉదయ భాస్కర్‌ (అనంతబాబు) ప్రధాన నిందితుడిగా అరెస్టయి.. రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

హత్యకు కారణాలపై కుటుంబసభ్యుల నుంచి భిన్న ఆరోపణలు వినిపిస్తుంటే.. సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ మధ్య మాటామాటా పెరిగి అహం దెబ్బతిని వెనక్కి తోయడంతో డ్రైవర్‌ చనిపోయినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబం ఆరోపణ, నిందితుడి వాంగ్మూలం పరిగణనలోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చడంతో పాటు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, సాక్ష్యాధారాలు తారుమారు చేయడంపైనా దర్యాప్తు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రిమాండ్‌ రిపోర్టులో మే 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ నెలకొన్న అన్ని పరిణామాలను పేర్కొన్నారు.

హత్య జరిగింది ఇక్కడేనా..?మాజీ డ్రైవర్‌ హత్యకేసు దర్యాప్తులో భాగంగా మధ్యవర్తుల నివేదిక ప్రకారం.. కాకినాడ నగరంలోని శశికాంత్‌నగర్‌ వి.ఎస్‌.లక్ష్మి డిగ్రీకళాశాల రోడ్డులోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెహికల్‌ యార్డు వద్దకు ఎమ్మెల్సీని తీసుకెళ్లి విచారించారు. యార్డుకు ఆనుకుని దక్షిణ దిశలో ఉన్నఇసుక, ఎర్రకంకర మట్టిరోడ్డు మీదకు తీసుకెళ్లి.. అనంతబాబు చూపించారని పేర్కొన్నారు.

సుబ్రహ్మణ్యాన్ని చంపినప్పుడు అతన్ని కదలకుండా కట్టిన తాడు అని చెప్పి ఆ తాడును డీఎస్పీకి స్వాధీన పరిచారని పేర్కొన్నారు. అక్కడే ఉత్తర దిశగా కాలువకు ఆనుకుని ఉన్న ప్రదేశంలో సర్వే కర్రతో మృతుడు సుబ్రహ్మణ్యాన్ని కొట్టినట్లు చూపారని పేర్కొన్నారు. తాడు, కర్ర, మృతుని చెప్పులను ఆ ప్రాంతం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

ఇదిలాఉండగా.. సుబ్రహ్మణ్యం మృతదేహానికి కాకినాడ జీజీహెచ్‌లో మే 21న శవ పంచనామా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మృతదేహంపై 15 గాయాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

సెల్‌ఫోన్‌లో ఏముంది..?కేసు దర్యాప్తులో భాగంగా మే 23న పండూరు రోడ్డులో వాటర్‌ ట్యాంకు దగ్గర ఎమ్మెల్సీ అనంతను పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి ఐ13 గోల్డ్‌ కలర్‌ యాపిల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. సుబ్రహ్మణ్యం కుటుంబీకులను హెచ్చరిస్తూ ఫోన్‌ చేశారనే ఆరోపణలు.. అనంతబాబు రహస్యాలు తెలుసనే కారణంతోనే హత్య చేశారన్న నేపథ్యంలో కాల్‌డేటాతో పాటు సెల్‌ ఫోన్‌లో నిక్షిప్తమైన సమాచారం కీలకం కానుంది.

  • నేను చెప్పింది వినాలి..‘రోడ్డు ప్రమాదంలో మీ కుమారుడు చనిపోయాడు.. రూ.2 లక్షలు ఇస్తా.. మృతదేహాన్ని మీ స్వగ్రామానికి తీసుకెళ్లి దహనం చెయ్యండి.. నేను చెప్పింది వినాలి.. లేదంటే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’
  • హత్యకు గురైన మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన హెచ్చరికలివి.. (రిమాండ్‌ రిపోర్టు ఆధారంగా..)
    మే 19న రాత్రి 8.30 గంటలకు ఎమ్మెల్సీ అనంతబాబు నా భర్తకు ఫోన్‌ చేశాడు.. తర్వాత నాతో మాట్లాడుతూ..‘ నీ కొడుకు నాకు రూ.20వేలు ఇవ్వాలి కదా.. ఇవ్వడా.. నాకు డ్రైవర్‌ లేడు.. వాడు పని మానేశాడు.. డబ్బులు ఇచ్చేయాలని చెప్పు లేకపోతే కాలు, చెయ్యి తీసేస్తాన’ని బెదిరించాడని పోలీసులకు తల్లి నూకరత్నం చెప్పారు.
  • అనంతబాబు రహస్యాలు తన కొడుకు బయటపెడితే.. ఇబ్బంది అవుతున్న కారణంతో కొందరితో కలిసి చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. తమఅబ్బాయిని అనంతబాబు, అతని అనుచరులు చంపేశారన్నారు.

రహస్యాలు తెలుసనే..రహస్యాలు తన కొడుక్కి తెలుసనే కక్షతో మరికొందరితో కలిసి బీచ్‌కు తీసుకెళ్లి కొట్టి.. అనంతబాబు, అతని అనుచరులు చంపారని తండ్రి సత్యనారాయణ చెప్పారు.

2 లక్షలు ఇస్తానన్నాడు..తనసోదరుడి మరణానికి కారణం అడిగితే.. అదంతా నీకు అనవసరం.. రూ. 2 లక్షలు ఇస్తాను.. మీ ఊరు తీసుకెళ్లి అంత్యక్రియలు చేయండి.. ఒకటి ఒకటి అలా జరుగుతుంటాయని ఎమ్మెల్సీ అనంతబాబు బెదిరించారని సోదరుడు నవీన్‌ వాంగ్మూలం ఇచ్చారు.

మా మరిదిని చంపేస్తానన్నాడు..తన భర్త మరణానికి కారణం ఏమిటని అడిగితే ‘ నేను చెప్పినట్లు చెయ్యకపోతే నీ మరిదిని కూడా చంపుతాన’ని బెదిరించాడని.. ఈలోగా మా బంధువులు అక్కడికి రావడంతో అనంతబాబు నా భర్త శవాన్ని కారులో వదిలి పారిపోయాడని సుబ్రహ్మణ్యం

భార్య అపర్ణ డీఎస్పీకి నివేదించారు..సుబ్రహ్మణ్యం హత్య కేసులో కుటుంబీకుల వేదన (పోలీసులు కేసు డైరీలో పొందుపరిచిన వాంగ్మూలం ఆధారంగా..)

రిమాండ్‌ రిపోర్టులో ఏమి ఉందంటే...

‘నిందితుడు అనంతబాబు వైకాపా ఎమ్మెల్సీ. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మృతుని తల్లి వీధి రత్నం ఈ కేసుకు సంబంధించి మే 20న సర్పవరం ఠాణాలో ఫిర్యాదు చేశారు. అందులో... నా పెద్దకొడుకు సుబ్రహ్మణ్యం (24) ఆరేళ్లుగా అనంతబాబు వద్ద కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు.. మూడు నెలల కిందట ఉద్యోగం మానేశాడు.. ద్విచక్ర వాహన ప్రమాదం జరిగి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. వివాహ సమయంలో ఎమ్మెల్సీ వద్ద రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. తర్వాత రూ.30వేలు ఇచ్చాడు. ఇంకా రూ.20వేలు చెల్లించాల్సి ఉంది. అప్పుగా తీసుకున్న మిగిలిన సొమ్ము రూ.20వేలు చెల్లించాలని మాపై ఎమ్మెల్సీ ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. డబ్బు చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించాడు.

మే 19న రాత్రి 7.30 గంటలకు నా కుమారుడు సుబ్రహ్మణ్యం, మణికంఠ కలిసి బయటకు వెళ్లారు. 8.30 గంటలకు ఎమ్మెల్సీ ఫోన్‌ చేసి.. సుబ్రహ్మణ్యం కదలికలపై ఆరా తీశాడు.. రాత్రి 10.30 గంటల సమయంలో ఎమ్మెల్సీ కారులో సుబ్రహ్మణ్యంను ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్లాడు.. అర్థరాత్రి 12.50 గంటలకు ఎమ్మెల్సీ ఫోన్‌ చేసి.. సుబ్రహ్మణ్యానికి ప్రమాదం జరిగింది అపస్మారక స్థితిలో ఉన్నాడని సమాచారం ఇచ్చారు. మళ్లీ రాత్రి 1.33 గంటల ప్రాంతంలో ఫోన్‌ చేసి కాకినాడలో అమృత ఆసుపత్రి వద్ద ఉన్నామని చెప్పాడు. దీంతో బంధువులతో అక్కడికి వెళ్లాను. వైద్యులు పరీక్షించి సుబ్రహ్మణ్యం చనిపోయినట్లు ధ్రువీకరించారు. తర్వాత మృతదేహంతో పాటు నన్ను.. కారు నంబరు ఏపీ 39బి 0456లో ఎమ్మెల్సీ మేము ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు తీసుకొచ్చారు. రోడ్డు ప్రమాదం జరిగింది.. మీ ఊరు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని సలహా ఇచ్చాడు. జ్ఞరూ.2 లక్షలు ఇవ్వజూపారు. ప్రశ్నించగా.. నేను చెప్పింది వినండి అని ఎమ్మెల్సీ బెదిరించాడు. లేకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. వాగ్వాదం జరిగిన కొద్దిసేపటికి కారును వదిలేసి ఎమ్మెల్సీ అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయాడు....’ అని ఆమె పేర్కొన్నారని డీఎస్పీ రిమాండ్‌ రిపోర్టులో వివరించారు.

‘మృతదేహంపై గాయాలను పరిశీలించిన తల్లిదండ్రులు, బంధువులు రహదారి ప్రమాదం కాదని, ఎమ్మెల్సీ, అయన అనుచరుల వల్ల జరిగినవిగా అనుమానించారు. ఎమ్మెల్సీ రహస్యాలన్నీ సుబ్రహ్మణ్యంకు తెలిసి ఉండటం, కారు డ్రైవర్‌గా పని మానుకున్నప్పటి నుంచి పగపెంచుకున్నారనీ, మరోవైపు రూ.20వేల అప్పు తిరిగి చెల్లించకపోవడం, ఆయన రహస్యాలను వ్యాప్తి చేస్తాడనే కోపంతో ఎమ్మెల్సీ ఉన్నారని వారు అనుమానించారు. శవపంచాయతీ వివరాలను పరిగణనలోకి తీసుకున్న సర్పవరం పోలీసు ఇన్‌స్పెక్టర్‌ మే 22న కేసును తిరిగి నమోదు (రీ రిజిస్టర్‌) చేశారు. ఐపీసీ సెక్షన్‌ 302, 201 రెడ్‌విత్‌ 34, ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. కాకినాడ ఎస్పీ సూచనల మేరకు నేను దర్యాప్తు చేపట్టాను.

రక్తసంబంధీకులు, సాక్షులను విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేశాను. ప్రస్తుతం నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం ఎమ్మెల్సీ నేరం చేసినట్లుగా ప్రాథమికంగా స్పష్టమవుతోంది. ఇంకా దర్యాప్తు కొనసాగించాల్సి ఉంది. 23న ఎమ్మెల్సీని అరెస్ట్‌ చేశాం. నిందితుడి నేరం ఒప్పుకోలు వాంగ్మూలాన్ని నమోదు చేశాం. ఫోన్‌ సీజ్‌ చేశాం. మధ్యవర్తుల నివేదికలో హత్యకు గల అన్ని వివరాలను పొందుపరిచాం. నేరం ఒప్పుకోలు వాంగ్మూలం ఆధారంగా నాలుగు ప్రాంతాలకు వెళ్లి అక్కడి వివరాలు పరిశీలించామని డీఎస్పీ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

పోస్టుమార్టం ధ్రువపత్రం అందాల్సి ఉంది. మరికొంత మంది సాక్షుల్ని విచారించాలి. దర్యాప్తు పూర్తి చేసి అభియోగపత్రం దాఖలు చేసేందుకు సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబును 15 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించండి’ అని కాకినాడ డీఎస్పీ మే 23న వేసిన రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details