తెలంగాణ

telangana

ETV Bharat / city

PULICHINTALA: పులిచింతలలో స్టాప్‌లాక్ ఏర్పాటు పనులు నిలిపివేత

పులిచింతల ప్రాజెక్టులో స్టాప్‌లాక్ ఏర్పాటును రేపటికి వాయిదా వేశారు. చీకటిపడ్డ కారణంగా పనులను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయమే పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. పులిచింతల జలాశయానికి సందర్శకులను అనుమతించరాదని నిర్ణయించిన అధికారులు.. బారికేడ్లు ఏర్పాటు చేశారు.

By

Published : Aug 6, 2021, 10:44 PM IST

PULICHINTALA: పులిచింతలలో స్టాప్‌లాక్ ఏర్పాటు పనులు నిలిపివేత
PULICHINTALA: పులిచింతలలో స్టాప్‌లాక్ ఏర్పాటు పనులు నిలిపివేత

పులిచింతలలో స్టాప్‌లాక్ ఏర్పాటు పనులను అధికారులు రేపటికి వాయిదా వేశారు. చీకటి వేళ.. భద్రత దృష్ట్యా పనులు చేయటం సరికాదని నిపుణులు తేల్చి చెప్పారు. రేపు ఉదయం నుంచి స్టాప్‌లాక్ పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే జలాశయ సందర్శనకు అనుమతి నిలిపివేశారు. ఆ ప్రాంతంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.

పులిచింతల నీరు..

పులిచింతలలో ప్రస్తుతం 8.58 టీఎంసీల నీరు ఉంది. నీటిమట్టం 41.8 మీటర్లకు పడిపోయింది. అధికారులు 18 గేట్ల ద్వారా 3.74 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. మరోవైపు పులిచింతలకు ఎగువ నుంచి 31 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.

పులిచింతలలో ఏం జరిగింది..

కృష్ణాడెల్టా స్థిరీకరణే లక్ష్యంగా 2004లో ప్రారంభమైన పులిచింతల ప్రాజెక్టు..2013 చివర్లో పూర్తైంది. కేవలం నీటి నిల్వకు మాత్రమే దీనిని ఉపయోగిస్తారు. శ్రీనివాస కన్‌ స్ట్రక్షన్స్‌ సంస్థ.. ఈ ప్రాజెక్టు నిర్మించగా.. దాని తరఫున బెకాన్‌ సంస్థ గేట్లు బిగించే పనులు నిర్వహించింది. ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. గతేడాది అత్యధికంగా 8లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. పులిచింతలలో మొత్తం 24 గేట్లు ఉండగా నీటి ప్రవాహాన్ని బట్టి వాటిని ఎత్తేలా అధికారులు చర్యలు తీసుకుంటారు. గురువారం తెల్లవారుజామున కూడా ఇదే క్రమంలో గేట్లు ఎత్తేందుకు యత్నించగా 16వ నంబర్‌ గేటు 4 అడుగుల మేర పైకి లేచిన తర్వాత ఒక్కసారిగా శబ్దం వచ్చింది. ఏం జరిగిందా అని చూసేలోపే గేటు విరిగి నీటిలో పడిపోయింది.

పులిచింతల ప్రాజెక్టు నుంచి ఒకేసారి 20 లక్షల క్యూసెక్కుల మేర నీరు విడుదలకు తగ్గట్లుగా గేట్లను డిజైన్‌ చేశారు. ఒక్కో గేటు నుంచి 80 వేల క్యూసెక్కులకు పైగా నీరు వదలవచ్చు. కానీ గేటు విరిగిన సమయంలో మొత్తం ఔట్‌ఫ్లో 50వేల క్యూసెక్కుల లోపే ఉండగా.. అప్పటికే రెండు గేట్లు ఎత్తి ఉన్నాయి. మరో 2 గేట్లు ఎత్తే క్రమంలో ప్రమాదం జరిగింది. అంటే ఎక్కువ నీటి ప్రవాహం కారణంగా గేటు విరిగిందనేందుకు అవకాశం లేదు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన గేటుకు.. అటూ, ఇటూ ఉన్న గేట్ల వద్ద.. ట్యూనియల్‌ గడ్డర్ల కాంక్రీట్‌ తొలగిపోయినట్లు కనిపిస్తోంది. అధికారులు మాత్రం నిర్మాణ లోపాలు కారణం కాకపోవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు ఏపీ నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ నారాయణరెడ్డి అన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details