కరోనా దెబ్బతో అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు స్తంభించడంతో వీధి వ్యాపారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడింది. వీధి వ్యాపారులు రోడ్డున పడ్డారు. ఎంఎస్ఎంఈలు తమ కార్యకలాపాలు కొనసాగకపోవడంతో ఆర్థికంగా దెబ్బతిని నిలదొక్కుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దుర్భర పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈలకు తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకాన్ని ప్రకటించింది. కానీ బ్యాంకర్లు సక్రమంగా స్పందించకపోవడంతో రుణాలు అందడం లేదు.
క్షేత్ర స్థాయిలో సమీక్ష
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ను అమలు చేయడానికి బ్యాంకర్లలో ఎక్కువ భాగం చొరవ చూపకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ గురువారం బ్యాంకర్లు, పరిశ్రమలు, మున్సిపల్ అధికారులు, కలెక్టర్లు తదితర ముఖ్యమైన శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అమలు తీరు, వీధి వ్యాపారులకు ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.