ఐటీ సేవలందించే సాఫ్ట్వేర్ కంపెనీలు ఈసారి ప్రాంగణ నియామకాలు తగ్గిస్తున్నాయి. ఇంజినీరింగ్ కళాశాలల ప్రాంగణ నియామక అధికారుల అంచనా ప్రకారం.. అది కనీసం 20-30 శాతం వరకు ఉండొచ్చు. కొన్ని పరిశ్రమలు ఎంపికలు గణనీయంగా తగ్గించాయని వారు స్పష్టంచేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉత్పత్తి తరహా పరిశ్రమలు మాత్రం గతంలో మాదిరే నియామకాలు చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు గత ఏడాది కంటే కాస్త మెరుగ్గా కొలువులు ఇస్తుండటం విశేషం.
ఈసారి కరోనా కారణంగా రాత పరీక్ష, ఇంటర్వ్యూ ప్రక్రియ అంతా ఆన్లైన్ విధానంలోనే కొనసాగిస్తున్నాయి. ఏటా రాష్ట్రం నుంచి దాదాపు 30వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాంగణ నియామకాలకు ఎంపికవుతున్నారని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) గణాంకాలు చెబుతున్నాయి. ఈసారి ఆ సంఖ్య 20వేలకు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.
ఫలితాల కోసం ఎదురుచూపులు
ఈసారి నియామకాలకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ అంతా ఆన్లైన్లోనే జరుపుతున్నందున ఫలితాల వెల్లడి ఆలస్యం అవుతోందని ప్రాంగణ నియామకాల అధికారులు చెబుతున్నారు. టీసీఎస్ నింజా ఫలితాల కోసం వేలమంది ఎదురుచూస్తున్నారు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా దాదాపు 40వేల మందిని ఎంపిక చేసుకుంటుంది. కాగ్నిజెంట్ కూడా ఈసారి ఆన్లైన్ పరీక్షలు నిర్వహించింది. ఫలితాలు వెలువడాల్సి ఉంది. క్యాప్ జెమినీ సైతం కళాశాలలకు వెళ్లకుండా విద్యార్థులందరికీ కలిపి ఆన్లైన్ పరీక్ష జరిపింది. నెలాఖరు వరకు ప్రాంగణ నియామకాలపై మరింత స్పష్టత వస్తుందని కళాశాలల ప్రతినిధులు చెబుతున్నారు.